సాయిరెడ్డి వర్సెస్ రవిప్రకాశ్: రేవంత్ రెడ్డిపై పంపిన లేఖనే ఇప్పుడు: ఆ న్యూస్ ఛానళ్లపైనా..!
రాజ్యసభ సభ్యుడు..వైసీపీ నేత విజయ సాయిరెడ్డి మీద పరువు నష్టం దావా వేయాలని టీవీ-9 మాజీ సీఈవో రవిప్రకాశ్నిర్ణయించారు. కొద్ది రోజుల క్రితం సంస్థలో డైరెక్టర్లకు తెలియకుండా దాదాపు రూ.18 కోట్లను దారి మళ్లించారనే అభియోగాల మీద రవి ప్రకాశ్ ను పోలీసులు అరెస్ట్ చేసారు. అదే సమయంలో విజయ సాయిరెడ్డి సుప్రీం ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాసారు. రవి ప్రకాశ్ విదేశాల్లో పెట్టుబడులు పెట్టారని నిబంధనలను ఉల్లంఘించారని..ఆయన మీద చట్ట ప్రకారం విచారణకు ఆదేశించాలని లేఖలో కోరారు. అయితే, ఇప్పుడు ఆ వ్యవహారం మీద రవి ప్రకాశ్ మేనేజ్ స్పందించారు. గతంలో రేవంత్ రెడ్డి మీద చేసిన ఆరోపణల ప్రతినే ఇప్పుడు ఎంపీ విజయసాయిరెడ్డి తన లెటర్హెడ్పై పంపారని ఆరోపించారు. అత్యుత్సాహం చూపిన ఛానళ్ల మీద చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసారు.
విజయసాయిరెడ్డి పైన పరువు నష్టం దావా
టీవీ-9 మాజీ సీఈవో రవిప్రకాశ్పై అసంబద్ధమైన, అసత్య ఆరోపణలు చేసినందుకు వైసీపీ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిపై రూ.100 కోట్లకు పరువునష్టం దావా వేయాలని నిర్ణయించామని రవిప్రకాశ్ మేనేజర్ తెలిపారు. ఏబీసీఎల్ సంస్థలోకి రామేశ్వరరావు, మెఘా కృష్ణారెడ్డి చట్టవ్యతిరేకంగా ప్రవేశించారని, వారిద్దరే రవిప్రకాశ్పై ఆరోపణలు చేయిస్తున్నారని ఆరోపించారు. సంస్థలో రూ.18 కోట్లు దారి మళ్లించారనే అభియోగాల మీద అరెస్ట్ అయిన రవి ప్రకాశ్ మీద విజయ సాయిరెడ్డి సుప్రీం చీఫ్ జస్టిస్ కు లేఖ రాసారు. అందులో రవి ప్రకాశ్ నిబంధనలను ఉల్లంఘించారని..ఆయన మీద విచారణకు ఆదేశించి చర్యలు తీసుకోవాలని కోరారు.
రేవంతరెడ్డి మీద రాసిన లేఖ ప్రతినే..
గతంలో కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డిపై మలేసియా, సింగపూర్లకు నిధులను తరలించారంటూ అసత్య ఫిర్యాదులు పంపిన రామారావు అభాసుపాలయ్యారని గుర్తు చేసిన రవి ప్రకాశ్ మేనేజర్ ఆ ఆరోపణలు కేవలం గాలి కబుర్లేనని అధికారులు నిర్ధారించారని వివరించారు. అప్పట్లో రామారావు పంపిన లేఖ ప్రతినే.. ఎంపీ విజయసాయిరెడ్డి తన లెటర్హెడ్పై ఇప్పుడు పంపించారని పేర్కొన్నారు. నెల క్రితం ఇవే ఆరోపణలను రామేశ్వరరావు, మెఘా కృష్ణారెడ్డి అనుచరుడైన రామారావు లిఖితపూర్వకంగా వివిధ శాఖలకు పంపించారని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
ఆ న్యూస్ ఛానళ్లపైనా చర్యలు..
రవి ప్రకాశ్ మీద చేస్తున్న ఆరోపణల కట్టుకథల వెనుక రామేశ్వరరావు, మెఘా కృష్ణారెడ్డి ఉన్నారని స్పష్టంగా అర్థమవుతోందని ఆయన మేనేజర్ పేర్కొన్నారు. కంపెనీ షేర్ల వివాదంలో పైచేయి సాధించడం కోసం వారిద్దరూ ఈ ఆరోపణలను వివిధ శాఖలకు పంపిస్తున్నారన్న విషయం స్పష్టంగా అర్థమవుతోందని తెలిపారు. నిరాధారమైన ఆరోపణలను అత్యుత్సాహంతో ప్రసారం చేసిన న్యూస్ చానళ్లపైనా చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్లు రవిప్రకాశ్ మేనేజర్ ఆ ప్రకటనలో వివరించారు. ఇప్పుడు ఈ వ్యవహారం మీద చర్చ మొదలైంది.