టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ అరెస్ట్, చంచల్గూడ జైలుకు తరలింపు
టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ను బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఏబీసీఎల్ కంపెనీ నిధులు దుర్వినియోగం చేశారనే అభియోగంపై రిమాండ్కు తరలించారు. ఈ మేరకు డీసీపీ సుమతి మీడియాకు వివరాలు వెల్లడించారు. అంతకుముందు రవిప్రకాశ్కు గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. రవిప్రకాశ్తోపాటు మూర్తి కూడా నిధులు గోల్ మాల్ చేశారని పోలీసులు గుర్తించారు. ఈ కేసు వివరాల్లోకి వెళితే..
నాటకీయ ఫక్కీలో
రవి ప్రకాశ్ను అదుపులోకి తీసుకునే వ్యవహారం నాటకీయ ఫక్కీలో జరిగిపోయింది. ఆయనను అదుపులోకి తీసుకొన్న బంజారా హిల్స్ పోలీసులు ఐదున్నర గంటల సేపు విచారించారు. వైద్య పరీక్షల తర్వాత నాంపల్లి కోర్టుకు సంబంధించిన సీతాఫల్ మండిలోని న్యాయమూర్తి నివాసంలో హాజరుపరిచారు. ఆయనపై చీటింగ్ కేసును నమోదు చేశారు. ఆయనతోపాటు ఎంకేవీఎన్ మూర్తిని కూడా చంచల్గూడ జైలుకు తరలించారు.
నిధుల దుర్వినియోగం
ఏబీసీఎల్ కంపెనీకి చెందిన కోట్ల రూపాయలు రవిప్రకాశ్ దుర్వినియోగం చేశారని ఆరోపణలతో ఇవాళ ఆయనను బంజారాహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. దారి మళ్లించిన రూ.18 కోట్ల గురించి పోలీసులు ఆరా తీశారు. బోనస్ పేరుతో రూ.18 కోట్లను మూడు విడతలుగా విత్ డ్రా చేసినట్టు గుర్తించారు. కంపెనీని నష్టాలకు గురిచేశారని అలంద మీడియో డైరెక్టర్ గురువారం ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశాం. ఆయనను రిమాండ్కు తరలించాం అని డీసీపీ సుమతి తెలిపారు.
14 రోజులపాటు రిమాండ్
ఏబీసీఎల్ కంపెనీ నిధుల దుర్వినియోగం కేసులో చంచల్ గూడకు తరలించారు. 14 రోజులుపాటు రిమాండ్కు తరలిచారు. ఈ నేపథ్యంలో రవిప్రకాశ్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో మరిన్ని విషయాలు రాబట్టడానికి జుడీషియల్ కస్టడీని అడుగుతామని డీసీపీ సుమతి పేర్కొన్నారు.
నమోదు చేసిన సెక్షన్లు
రవిప్రకాశ్, మూర్తిపై 409, 418, 420 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. నిధుల గోల్మాల్ గురించి గుచ్చి గుచ్చి ప్రశ్నించారు. తర్వాత రవిప్రకాశ్ను అరెస్ట్ చేశారు. కాసేపట్లో నాంపల్లి కోర్టులో ప్రవేశపెడతారు. టీవీ9 మాజీ సీఎఫ్వో ఎంకేవీఎన్ మూర్తి కూడా నగదు దారి మళ్లించారని పోలీసులు గుర్తించారు. రూ.5.97 కోట్లు ఆయన విత్ డ్రా చేశారని పోలీసు అధికారులు పేర్కొన్నారు. ఇటు రవిప్రకాశ్పై నిధుల గోల్మాల్, టీవీ9 లోగో విక్రయించారనే మరో రెండు కేసులు కూడా బంజారాహిల్స్ పోలీసు స్టేషన్లో దాఖలైన సంగతి తెలిసిందే.