హైదరాబాద్లో కాల్పుల మోత.. పోలీస్ కేసులో ట్విస్ట్
హైదరాబాద్ : నగరం ఉలిక్కిపడింది. కాల్పులమోతతో అలజడి రేగింది. సుచిత్ర - కొంపల్లి సమీపంలోని పేట్ బషీరాబాద్లో రియలర్ట్ వేణుగోపాల్ రెడ్డి తుపాకీ మోత మోగించారు. ప్రత్యర్థిపై కాల్పులు జరపడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. దేవరాంజల్ గ్రామానికి చెందిన వేణుగోపాల్ రెడ్డి, నర్సింహ రెడ్డి మధ్య వివాదం చెలరేగింది. ఓ భూమికి సంబంధించిన విషయంలో ఇరువురి మధ్య తగాదా నడుస్తోంది.
ఆ క్రమంలో నర్సింహరెడ్డి కుమారుడు మహిపాల్ రెడ్డి ఆ వివాదంలో తలదూర్చారు. వివాదం నెలకొన్న భూమిలో రాళ్లు పాతడానికి ప్రయత్నించారు. అదే సమయంలో అక్కడకు చేరుకున్న వేణుగోపాల్ రెడ్డి, మహిపాల్ రెడ్డితో వాగ్వాదానికి దిగాడు. మాటమాట పెరగడంతో ఆగ్రహం చెందిన వేణుగోపాల్ రెడ్డి తన దగ్గరున్న తుపాకీతో మహిపాల్ రెడ్డిపై కాల్పులు జరిపాడు. ఆ నేపథ్యంలో మహిపాల్ తండ్రి నర్సింహరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అదలావుంటే బాధితుడు మహిపాల్ రెడ్డి మాత్రం మరో వెర్షన్ వినిపిస్తున్నట్లు సమాచారం. కుటుంబ కలహాలతో వివాదం చెలరేగిందని.. తాను పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు చేయడం లేదని చెబుతుండటం గమనార్హం.