రెండు రోజులు మరింత చలి.. ఢిల్లీ స్థాయిలో పడిపోతున్న టెంపరేచర్
హైదరాబాద్ : తెలంగాణపై చలి పులి పంజా విసిరింది. పెథాయ్ తుపానుకు ముందు అంతగా లేని చలి.. దాని తర్వాత ఒక్కసారిగా విరుచుకుపడింది. రాష్ట్రవ్యాప్తంగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తెలంగాణలో ఎన్నడూలేని విధంగా.. దేశ రాజధాని ఢిల్లీ స్థాయిలో తక్కువ టెంపరేచర్ రికార్డవుతోంది.
తీవ్రమైన చలితో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గతంలో ఎన్నడూ చూడనంత చలి ఇప్పుడే చూస్తున్నామంటున్నారు. ఉదయం 11 గంటలు దాటుతున్నా.. బయటకు రాలేని పరిస్థితి. ఇక అటవీ ప్రాంతంతో పాటు చెట్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో చలి గజగజ వణికిస్తోంది.
ఈ రెండు రోజులు కష్టమే
నార్త్ ఇండియా నుంచి వీస్తున్న చలి గాలి రాష్ట్రంపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయి చలి బాగా పెరిగింది. బుధ, గురువారాల్లో చలి గాలి తీవ్రత మరింత అధికంగా ఉంటుందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఆదిలాబాద్ లో మంగళవారం వేకువజామున 5 డిగ్రీల టెంపరేచర్ నమోదు కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. మెదక్ లో 6 డిగ్రీలు, హైదరాబాద్, రామగుండం, హన్మకొండ తదితర ప్రాంతాల్లో 9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు సమాచారం.
పగలు ఓకే.. రాత్రి సమయాల్లోనే..!
రాత్రిపూట ఉష్ణోగ్రతల్లో భారీ మార్పు కనిపిస్తోంది. మామూలు రోజులకన్నా దాదాపు 8 డిగ్రీల వరకు తక్కువ టెంపరేచర్ ఉండటంతో చలి తీవ్రతను తట్టుకోవడం కష్టమైపోతోంది. పగటి ఉష్ణోగ్రతల్లో దాదాపుగా ఎలాంటి మార్పు కనిపించనప్పటికీ.. రాత్రి సమయాల్లో మాత్రం చలి పులి పంజా విసురుతోంది. మధ్యాహ్నం పొడి వాతావరణం వల్ల గాలిలో తేమ శాతం తగ్గిపోయి మంచు కారణంగా రాత్రిళ్లు చలి బాగా పెడుతోంది.
పెరిగిన చలితో ఇబ్బందులు
చిన్న పిల్లల నుంచి పెద్దోళ్ల దాకా చలిని తట్టుకోలేని పరిస్థితి. చలి బారి నుంచి కాపాడుకోవటానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా.. చలిని తట్టుకోవడం ఇబ్బందిగా మారుతోంది. ఇక వృద్ధుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. చలిని తట్టుకోలేక గజగజ వణికిపోతున్నారు. చలి తీవ్రత కారణంగా కొన్ని ప్రాంతాల్లో మృత్యువాత పడుతున్నారు. ఆదిలాబాద్ లో సోమవారం అత్యల్పంగా 4 డిగ్రీల మేర టెంపరేచర్ నమోదు కావడంతో ఒకే గ్రామానికి చెందిన ఇద్దరు వృద్ధులు చనిపోయారు. పెరుగుతున్న చలితో శ్వాస ఆడక చాలామంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.