తెలంగాణలో రెండురోజులు వర్షాలు, హైదరాబాద్లో భారీ వర్షం..
ఉపరితల ఆవర్తణ ద్రోణితో తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. రెండురోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. తమిళనాడు నుంచి ఛత్తీస్గఢ్ వరకు 900 మీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తన ద్రోణి ఏర్పడింది. ప్రస్తుతం మహారాష్ట్ర పరిధిలోని మరాఠ్వాడాలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఆది, సోమవారాలు అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉంది అని హైదరాబాద్ వాతావరణ కేంద్ర అధికారులు తెలిపారు. దక్షిణ భారతదేశం నుంచి తెలంగాణ దిశగా తేమగాలులు వీస్తున్నాయన్నారు
శనివారం నుంచి చల్లని వాతావరణం నెలకొంది. ఈదురుగాలులు కూడా వీశాయి. ఆదివారం ఉదయం నుంచి కూడా వాతావరణం చల్లగా ఉంది. హైదరాబాద్లో భారీ వర్షం కురుస్తోందని అధికారులు హెచ్చరించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఉపరితల ఆవర్తనంతో చలిగా ఉంది. శనివారం హైదరాబాద్లో 29.2 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఇటు రాష్ట్రంలో ఇతర చోట్ల కూడా వర్షం కురిసింది. కరీంనగర్ జిల్లా వెల్దిలో 60, సర్వాయిపేటలో 44.3, హుస్నాబాద్లో 30.8 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది.