ఇద్దరు మంత్రులు టచ్లో ఉన్నారు.. కొండా హాట్ కామెంట్స్
తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీ అవసరం ఉందని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి అన్నారు. అలాంటి ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక కోసం తాను, ఈటల రాజేందర్ మరికొంత మంది ప్రయత్నిస్తున్నామని తెలిపారు. కేసీఆర్పై టీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో చాలా వ్యతిరేకత ఉందన్నారు. కేసీఆర్ కేబినెట్లోని మరో ఇద్దరు మంత్రులు తమతో టచ్లో ఉన్నారని కొండా విశ్వేశ్వరరెడ్డి స్పష్టం చేశారు.
టీఆర్ఎస్పై పోరాటం చేసే పరిస్థితిలో కాంగ్రెస్, బీజేపీలు లేవన్నారు. తమ ఆలోచనలకు రేవంత్రెడ్డి మద్దతు కూడా ఉందని చెప్పారు. మరో రెండు నెలల్లో తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయని వ్యాఖ్యానించారు. షర్మిలకు తెలంగాణలో రాజకీయ భవిష్యత్ ఉంటుందని అనుకోవడంలేదని కొండా విశ్వేశ్వరరెడ్డి పేర్కొన్నారు.
దేవరయాంజల్ భూముల వ్యవహారంలో టీఆర్ఎస్ హై కమాండ్ ఈటల రాజేందర్ను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేసిన విషయం తెలిసిందే. ఈటలపై అధికారపరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. ఈటల ఒక్కరిపైనే కాదు.. టీఆర్ఎస్లో భూకబ్జాలకు పాల్పడిన ప్రతిఒక్కరిపై చర్యలు తీసుకోవాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈటల రాజేందర్ పార్టీ మారితే తమ తమ పార్టీల్లోకి తీసుకోవాలని యోచిస్తున్నాయి. కానీ ఆయన మాత్రం సొంతంగా పార్టీ పెట్టాలని అనుకుంటున్నారు.