పగలు రెక్కీ.. రాత్రి చోరీ.. ఇద్దరే ఇద్దరు.. ఎన్ని దొంగతనాలు చేశారంటే..!
హైదరాబాద్ : తెలంగాణ పోలీసులు దూకుడు పెంచారు. టెక్నాలజీ వాడేస్తూ నేరాల నియంత్రణకు అడ్డుకట్ట వేసేలా శ్రమిస్తున్నారు. ఆ క్రమంలో కొన్ని నేరాల్లో నిందితులుగా ఉన్నోళ్ల ఆట కట్టిస్తున్నారు. ఇన్నాళ్లు పోలీసుల కళ్లుగప్పి సవాల్ విసురుతున్న దొంగలకు చెక్ పెడుతున్నారు. తాజాగా చోరీల్లో ఆరితేరిన ఇద్దరు దొంగల గుట్టురట్టు చేశారు.
ఇద్దరే ఇద్దరు.. ఒకటి కాదు రెండు కాదు దాదాపు 40 దొంగతనాలు చేశారు. పోలీసులకు చిక్కకుండా చోరీలకు పాల్పడుతున్నారు. అయితే ఇటీవల టపాచబుత్ర ప్రాంతంలో వారిద్దరు కలిసి దొంగతనం చేసిన ఘటన వెలుగుచూసింది. సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా చోరీ కేసు చేధించిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు.
బుద్ది ఎక్కువైతే కష్టమే.. గురుపౌర్ణమి నాడు చిన్నజీయర్ ఇలా చెప్పారేంటబ్బా..!
సయ్యద్ మాజిద్, మౌసిన్ అలీ.. చోరీలు తప్ప మరో పని తెలియని వీరిద్దరు నలభై దొంగతనాలు చేశారు. చోరీలు చేస్తూ దర్జాగా తిరుగుతున్న వీరు ఎట్టకేలకు పోలీసుల వలలో పడ్డారు. అపహరించిన సొత్తును అమ్మే క్రమంలో అడ్డంగా దొరికిపోయారు. టాస్క్ఫోర్స్ పోలీసులు వీరిపై నిఘా పెంచడంతో పట్టుబడ్డారు. నిందితుల నుంచి 50 వేల రూపాయల నగదుతో పాటు 246 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.
పగటి సమయంలో రెక్కీలు నిర్వహించడం.. రాత్రి వేళల్లో దొంగతనాలు చేయడం వీరి స్టైల్. పకడ్బందీగా చోరీలు చేయడంలో వీరిద్దరు దిట్ట. తాళం వేసి ఉన్న ఇళ్లను గుర్తించి దొంగతనాలకు స్కెచ్ వేస్తారు. అలా రాత్రి సమయంలో టార్గెట్ చేసిన ఇళ్లల్లో దూరుతూ అందినకాదికి దోచుకుంటున్నారు.