హైసెక్యూరిటీ జోన్: లోటస్పాండ్లో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం..కలకలం: ఆ పక్కనే జగన్ నివాసం
హైదరాబాద్: హైదరాబాద్లోని బంజారాహిల్స్లో కలకలం చెలరేగింది. హై సెక్యూరిటీ జోన్ పరిధిలోని బంజారాహిల్స్లో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం కావడం ఆందోళనకు దారి తీసింది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత నివాసానికి సమీపంలో ఉన్న లోటస్పాండ్లో ఈ మృతదేహాన్ని ఆదివారం ఉదయం గుర్తించారు స్థానికులు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు లోటస్పాండ్ వద్దకు చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్ట్మార్టమ్ కోసం తరలించారు.
మృతదేహం శరీరంపై ట్రాక్ ప్యాంట్, టీ షర్ట్ ఉన్నాయి. దీన్ని బట్టి- మృతుడు లోటస్పాండ్ వద్దకు వాకింగ్కు వచ్చి ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. వాకింగ్ చేయడానికి రోజు పలువురు ప్రముఖులు లోటస్పాండ్కు వస్తుంటారు. అలా వచ్చిన వారిలో ఎవరైనా ఈ చెరువులో పడి మరణించి ఉండొచ్చని భావిస్తున్నారు. హత్యాకోణంలోనూ దర్యాప్తు చేపట్టే అవకాశాలు లేకపోలేదు. మృతదేహం ఎవరిదనే విషయంపై ప్రస్తుతం పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆ తరువాతే ఈ కేసులో మరింత దర్యాప్తు చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు.
వాకింగ్ చేస్తూ పొరపాటున లోటస్పాండ్లో పడిపోయి ఉండొచ్చా? లేక ఇతరత్రా కారణాలేవైనా ఉన్నాయా? అనేది పోస్ట్మార్టమ్ నివేదికలో తేలుతుందని పోలీసులు చెబుతున్నారు. వాకింగ్ చేస్తూ, గుండెపోటుకు గురి కావడం వల్ల పొరపాటున లోటస్ పాండ్లో జారిపడటానికీ అవకాశం లేకపోలేదనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. పోస్ట్మార్టమ్ నివేదిక అందిన తరువాతే ఆ వ్యక్తి ఎలా మరణించాడనేది తేలుతుందని అంటున్నారు. మృతదేహం దొరికిన లోటస్ పాండ్.. వైఎస్ జగన్ వ్యక్తిగత నివాసానికి సమీపంలో ఉండటం, హైసెక్యూరిటీ జోన్ పరిధిలో ఉండటం వల్ల స్థానికంగా కలకలం చెలరేగింది.