ముంపు ప్రాంతాల్లో పర్యటన... జీహెచ్ఎంసీ కమిషనర్పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఫైర్...
హైదరాబాద్లో భారీ వర్షాల కారణంగా నీట మునిగిన లోతట్టు ప్రాంతాల్లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పర్యటించారు.హిమాయత్ నగర్లోని దత్తా నగర్,జనార్దన్ వాడ,దోమలగూడ,ఖైరతాబాద్లోని ఓల్డ్ సీబీఐ క్వార్టర్స్,గణేశ్ నగర్ తదితర ప్రాంతాల్లో పర్యటించారు. తన పర్యటన సందర్భంగా జీహెచ్ఎంసీ అధికారులు అందుబాటులో లేకపోవడంపై కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్కు ఫోన్ చేసి అధికారులను ఎందుకు పంపించలేదని ప్రశ్నించారు. వరద సహాయక చర్యల్లో జీహెచ్ఎంసీ అధికారులు విఫలమయ్యారని మండిపడ్డారు.
లోతట్టు ప్రాంతాల్లో పర్యటన సందర్భంగా బాధిత కుటుంబాలతో కిషన్ రెడ్డి మాట్లాడారు. వారి సమస్యలు,ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. హైదరాబాద్లో గత 40 ఏళ్లలో ఇంతటి వర్ష బీభత్సాన్ని చూడలేదన్న ఆయన... అత్యవసరమైతేే తప్ప ప్రజలు ఇళ్లనుంచి బయటకు రావద్దని విజ్ఞప్తి చేశారు. ఖైరతాబాద్లో పర్యటన సందర్భంగా కలెక్టర్ శ్వేతా మహంతితో కిషన్ రెడ్డి ఫోన్లో మాట్లాడారు. అక్కడి ప్రజలకు నిత్యావసరాలు,పాలు, ఆహారం పంపిణీ చేయాలని కలెక్టర్కు సూచించారు.
హైదరాబాద్లో గత 33 ఏళ్లలో కనివీని ఎరగని రీతిలో సోమ(అక్టోబర్ 12),మంగళ(అక్టోబర్ 13) వారాల్లో భారీ వర్షం కురిసింది. ఐదు లేదా ఆరు సెం.మీ వర్షానికే అతలాకుతలమయ్యే నగరంలో చాలాచోట్ల 20సెం.మీ కంటే ఎక్కువ వర్షపాతం నమోదవడంతో నగర జీవనం తీవ్రంగా ప్రభావితమైంది. నగర పరిధిలోని నాలాలు,డ్రైనేజీలు,మూసీ పొంగి పొర్లాయి. చాలా ప్రాంతాల్లో రహదారులపైకి మోకాలి లోతు నీళ్లు చేరాయి. ఇళ్ల ముందు పార్కింగ్ చేసిన వాహనాలు కొట్టుకుపోయాయి. ఎక్కడ మ్యాన్ హోల్స్ ఉన్నాయో తెలియక జనం బయటకు వచ్చేందుకే భయపడ్డారు. నీట మునిగిన ప్రాంతాల్లో ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం వాయుగుండంగా మారి కాకినాడ వద్ద తీరం దాటడంతో భారీ వర్షాలు సంభవించాయి. మరో రెండు రోజులు తెలంగాణలో ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.
Live: Visit to Rain Affected Area of BJR Nagar, Ganesh Nagar - Khairtabad, Hyderabad. Part 2. https://t.co/6GC06t8B5w
— G Kishan Reddy (@kishanreddybjp) October 15, 2020