ఇంటికో బోటు కావాలా ? కాల్వల పునరుద్ధరణ కావాలా ? కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సూటి ప్రశ్న
గ్రేటర్ హైదరాబాద్ లో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, గ్రేటర్ మేయర్ పీఠాన్ని బీజేపీ చేజిక్కించుకుంటుంది అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. గ్రేటర్ హైదరాబాద్ వాసులు బీజేపీని స్వాగతిస్తున్నారని, ప్రజలు తమ పార్టీని ఆశీర్వదిస్తారని పేర్కొన్నారు కిషన్ రెడ్డి. చాలా చోట్ల యువత స్వచ్ఛందంగా ముందుకు వచ్చి బీజేపీ కోసం ప్రచారం నిర్వహిస్తున్నారు అంటూ పేర్కొన్న ఆయన బీజేపీ మీద తప్పుడు ప్రచారం చేయడంలో, అబద్ధాలు చెప్పడంలో తండ్రి కొడుకులు కేసీఆర్ , కేటీఆర్ లు పోటీపడుతున్నారు అంటూ వ్యాఖ్యానించారు.
పాత మ్యానిఫెస్టోనే మళ్ళీ కొత్తగా ... టీఆర్ఎస్ కు 20 సీట్లు కూడా కష్టమే : మాజీ ఎంపీ వివేక్
కేంద్రంపై తండ్రీ, కొడుకుల తప్పుడు ప్రచారాలు
ఈరోజు పార్టీ కార్యాలయంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ , ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ తో కలిసి సమావేశం నిర్వహించిన ఆయన టిఆర్ఎస్ పార్టీ పైన నిప్పులు చెరిగారు. కావాలని కేంద్ర ప్రభుత్వం పై కేసీఆర్, కేటీఆర్ లు తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. దుబ్బాక ఎన్నికల ఫలితాలని, గ్రేటర్ హైదరాబాద్ లో ప్రజలు కోరుకుంటున్నారని, గ్రేటర్ లోనూ బీజేపీ జెండా రెపరెపలాడటం ఖాయమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
వరద బురదలేని హైదరాబాద్ ను నిర్మిస్తాం అన్న కిషన్ రెడ్డి
వరద బురద లేని హైదరాబాద్ నిర్మిస్తామని పేర్కొన్నారు . జిహెచ్ఎంసి లో గృహ నిర్మాణ కార్యక్రమానికి కూడా ప్రాధాన్యత ఇస్తామని తెలియజేశారు. ఇక వివరాలన్నీ తమ మేనిఫెస్టోలో పొందుపరుస్తామని చెప్పిన కిషన్ రెడ్డి గ్రేటర్ లో బీజేపీ విజయం సాధిస్తే కుటుంబాల ప్రమేయం లేని సమర్థవంతమైన ,నీతివంతమైన పాలన అందుతుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని చెప్పారు.
ఫుట్ పాత్ లపై , టాయిలెట్స్ దగ్గర టీఆర్ఎస్ నేతల హోర్డింగులు
హైదరాబాద్ లో ఫుట్ పాత్ లపై , టాయిలెట్స్ పై ఎక్కడ చూసినా టీఆర్ఎస్ నేతల హోర్డింగులు కనిపిస్తున్నాయని ఇది పూర్తిగా హైకోర్టు, సుప్రీం కోర్టు తీర్పులకు విరుద్ధమని పేర్కొన్నారు.టాయిలెట్ లో నీళ్ళు ఉండవు కానీ బయట హోర్డింగుల హడావిడి మాత్రం కనిపిస్తుందని అన్నారు . గత గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఇచ్చిన హామీలన్నీ అమలు చేయకుండా, మళ్లీ వాటిని తిరిగి రూపొందించి ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేశారని మండిపడ్డారు.
టీఆర్ఎస్ గెలిస్తే ఇంటికో బోటు .. బీజేపీ గెలిస్తే వరద కాలువల నిర్మాణం
జిహెచ్ఎంసి ఎన్నికల్లో మళ్లీ టిఆర్ఎస్ అధికారంలోకి వస్తే ఇంటికొక బోటు ఇవ్వాలని ఎద్దేవా చేశారు. బీజేపీకి అవకాశం ఇస్తే యుద్ధ ప్రాతిపదికన వరద కాలువల నిర్మాణం చేపడతామని ప్రజలు ఏది అవసరమో తేల్చుకోవాలి అంటూ వ్యాఖ్యానించారు కిషన్ రెడ్డి. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని పేర్కొన్న కిషన్ రెడ్డి నిన్న దుబ్బాకలో కోరుకున్నారు..నేడు జీహెచ్ఎంసీలో కోరుకుంటున్నారు.. రేపు తెలంగాణ రాష్ట్రంలో కోరుకుంటారు అంటూ వ్యాఖ్యానించారు .
అంతిమ తీర్పు ప్రజలదే .. బుద్ధి చెప్తారు
రాష్ట్రంలో తాజా పరిస్థితులను, టిఆర్ఎస్ అసమర్థ పరిపాలన తీరును, వాస్తవ పరిస్థితులను ప్రజలముందు పెడుతున్నామని, ప్రజలే అంతిమ నిర్ణయం తీసుకుంటారని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో అబద్దాలాడటం , పూనకం వచ్చినట్లు ప్రవర్తించటం టిఆర్ఎస్ పార్టీ నేతలకు, కెసిఆర్, కేటీఆర్ లకు మామూలే అంటూ వ్యాఖ్యానించారు.టిఆర్ఎస్ నేతలు విచక్షణతో వ్యవహరించాలని, తప్పుడు ప్రచారం మానుకోవాలని హితవు పలికారు. కేంద్ర సహకారం విషయంలో టీఆర్ఎస్ పార్టీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ప్రజలు టిఆర్ఎస్ నేతలు చేస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మవద్దని పేర్కొన్న కిషన్ రెడ్డి ఈ ఎన్నికల్లో విజయం బిజెపిదేనని ధీమా వ్యక్తం చేశారు. టిఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు.