టార్గెట్ కేసీఆర్: 600 వెంటిలేటర్లు ఏమయ్యాయ్? గాంధీకి వెళ్తే ప్రాణాలతో తిరిగొచ్చేలా: కిషన్ రెడ్డి
హైదరాబాద్: ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తోంది భారతీయ జనతా పార్టీ. అటు తెలంగాణలో, ఇటు ఏపీలో ఈ అంశాన్ని రాజకీయంగా వినియోగించుకుంటోంది. ఏపీలో అత్యధికంగా కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించడానికి కేంద్రంలో అధికారంలో ఉన్న తమ ప్రభుత్వమే కారణమని చెబుతోన్న బీజేపీ నేతలు.. తెలంగాణలో దీనికి భిన్నమైన వాదనను వినిపిస్తున్నారు. కేంద్రం సహకరించినా.. తెలంగాణ సర్కార్ ఆశించిన స్థాయిలో కరోనా పరీక్షలను నిర్వహించట్లేదని అంటున్నారు.
600 వెంటిలేటర్లు ఏమయ్యాయ్?
కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు 600 వెంటిలేటర్లను పంపించిందని, అవి ఏమయ్యాయని సికింద్రాబాద్కు చెందిన బీజేపీ లోక్సభ సభ్యుడు, కేంద్ర హోం శాఖ సహాయమంత్రి జీ కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ఆదివారం ఆయన సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిని సందర్శించారు. తెలంగాణలోనే అతి పెద్ద కోవిడ్-19 ఆసుపత్రి ఇది. గాంధీ ఆసుపత్రిలోని అన్ని వార్డులను ఆయన పరిశీలించారు. రోగులను పలకరించారు. వారికి అందుతోన్న ఆహారం, వైద్య సదుపాయాల గురించి ఆరా తీశారు. కరోనా పేషెంట్లకు అందిస్తోన్న వైద్యం గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు.
యుద్ధ ప్రాతిపదికన చర్యలు..
కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి, పేషెంట్లకు మరింత నాణ్యమైన వైద్యాన్ని అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలను తీసుకోవాలని సూచించారు. గాంధీ ఆసుపత్రిలో కరోనా వైరస్ సోకిన పేషెంట్లకు ఆశించిన స్థాయిలో వైద్యం గానీ, ఆహారం గానీ అందట్లేదనే విషయం తన దృష్టికి వచ్చిందని చెప్పారు. ఢిల్లీ తరహాలో గాంధీ ఆసుపత్రిలో కోవిడ్ ర్యాపిడ్ యాంటీజెన్ పరీక్షలను నిర్వహిస్తున్నారని, వాటి సంఖ్యను మరింత పెంచాల్సిన అవసరం ఉందని అన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో యాంటీజెన్ పరీక్షలను నిర్వహించేలా కేంద్రం తరఫున చర్యలు చేపట్టామని చెప్పారు.
కేంద్రం తరఫున సహాయం..
కరోనా వైరస్ను నియంత్రించడంలో తెలంగాణ ప్రభుత్వానికి అవసరమైన అన్ని సహాయక చర్యలను అందిస్తామని కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు. మందులు, పరికరాలు, వెంటిలేటర్లు. ఇతర సామాగ్రిని కేంద్రం నుంచి పంపిస్తామని అన్నారు. వాటిని సక్రమంగా వినియోగించుకోవాల్సిన బాధ్యత కేసీఆర్ ప్రభుత్వంపై ఉందని గుర్తు చేశారు. సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిపై ప్రజలు విశ్వాసాన్ని కోల్పోయారని కిషన్ రెడ్డి అన్నారు. గాంధీ ఆసుపత్రికి వెళ్తే ప్రాణాలతో తిరిగి రాలేమనే నమ్మకం ప్రజల్లో నెలకొని ఉందని అన్నారు. దాన్ని పోగొట్టాలని, విశ్వాసాన్ని కల్పించాలని చెప్పారు.
Recommended Video
గచ్చీబౌలి ఆసుపత్రి ఇంకెప్పుడు?
గచ్చీబౌలిలో నిర్మించిన ఆసుపత్రిలో మరింత మెరుగైన వైద్యాన్ని అందిస్తామని కేసీఆర్ ప్రభుత్వం నెలరోజులుగా చెబుతోందని, ఇప్పటికీ దాన్ని ఆచరణలో పెట్టలేదని అన్నారు. గచ్చీబౌలి ఆసుపత్రిని ఇంకా ప్రారంభించనేలేదని చెప్పారు. గాంధీ ఆసుపత్రి, ఎర్రగడ్డ ఛెస్ట్ ఆసుపత్రి, నల్లకుంట ఫీవర్ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యాన్ని కల్పించాలని అన్నారు. దీనికి అవసరమైన సహాయ సహకారాలను అందించడానికి వెనుకాడబోమని తాను కేంద్రమంత్రిగా హామీ ఇస్తున్నట్లు చెప్పారు కిషన్ రెడ్డి. దీనికోసం తాను వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖతో మాట్లాడానని అన్నారు.