డబుల్ ఇంజిన్ ప్రభుత్వంతో వేగంగా అభివృద్ది, కేసీఆర్ ప్రభుత్వంపై నిప్పులు: యోగి
తెలంగాణ సర్కార్పై బీజేపీ ముఖ్యులు ఫైర్ అవుతున్నారు. ప్రధాని మోడీ సహా ఇతర నేతలు విరుచుకుపడ్డారు. తెలంగాణలో అరాచక పరిపాలన కొనసాగుతోందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మండిపడ్డారు. తెలంగాణ ప్రజలకు ఆయుష్మాన్ భారత్ పథకం అందట్లేదని అన్నారు. ఉత్తరప్రదేశ్లో 15 కోట్ల మందికి ఉచిత రేషన్ అందిస్తున్నామని, తెలంగాణలో అటువంటి పథకాలు అందట్లేదని విమర్శించారు. యూపీలో 'సబ్కా సాథ్.. సబ్కా వికాస్.. సబ్కా విశ్వాస్' భావనతో ముందుకు వెళ్తున్నామని చెప్పారు. ప్రధాని మోడీ నేతృత్వంలో దేశంలో వచ్చిన మార్పులు అందరి కళ్ల ముందు కనిపిస్తున్నాయని చెప్పారు. ప్రధాని మోడీ అయోధ్యలో రామాలయ నిర్మాణాన్ని ప్రారంభించడంతోపాటు కాశీలో విశ్వనాథుడి ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేశారని గుర్తు చేశారు.
రాష్ట్రంలో బీజేపీని అడ్డుకోవడానికి టీఆర్ఎస్ కుట్రలకు పాల్పడుతోందని ఆరోపించారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు బుద్ధి చెప్పినట్టుగా, మళ్లీ తిప్పికొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఉత్తరప్రదేశ్లో బీజేపీ డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఉండటంతో భారీ ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పారు. పేదల కోసం 45 లక్షల ఇళ్లు కట్టించామని.. ఆ రాష్ట్రంలో 6 కోట్ల మందికి ఆయుష్మాన్ భారత్ కింద ఆరోగ్య బీమా అమలు చేస్తున్నామని తెలిపారు. కరోనా సంక్షోభంలో 15 కోట్ల మందికి నెలకు రెండు సార్లు ఉచితంగా రేషన్ బియ్యం అందించామన్నారు.
తెలంగాణ సీఎం కేసీఆర్కు సరైన సమాధానం చెప్పేందుకే ఇవాళ భారీసంఖ్యలో బీజేపీ నేతలు, కార్యకర్తలు పరేడ్ గ్రౌండ్కు తరలివచ్చారని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని, తాము అన్నీవర్గాల ప్రజల అభివృద్ధిని కోరుకుంటామని చెప్పారు. కేసీఆర్ పాలనపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారని, టీఆర్ఎస్ పాలనపై తెలంగాణ వ్యాప్తంగా వ్యతిరేకత ఉందని అన్నారు. తెలంగాణలో అవినీతి రహిత ప్రభుత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారని ఆయన చెప్పారు.