బోట్ లో ముంపు బాధితుల పరామర్శకు వెళ్ళిన ఉప్పల్ ఎమ్మెల్యే .. తిట్టిపోసిన మహిళలు
భారీ వర్షాల కారణంగా అతలాకుతలమైన హైదరాబాదులో పరిస్థితి దారుణంగా తయారైంది . పాలకుల పట్టింపులేనితనంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి తన నియోజకవర్గ పరిధిలో వరద పరిస్థితిని సమీక్షించడానికి బోట్ లో వెళ్లారు. ఊహించని విధంగా ఆయనకు చేదు అనుభవం ఎదురైంది.
ఏడాది కాలంగా మరుగుదొడ్డిలో మహిళ నిర్బంధం .. భార్యపై భర్త అమానుషం
ఉప్పల్ ఎమ్మెల్యేకు చేదు అనుభవం .. మహిళల ఆగ్రహం
ఈరోజు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి వాహనంపై చెప్పులు విసిరిన ఘటన మరిచిపోకముందే మరో టీఆర్ఎస్ ఎమ్మెల్యేకి చేదు అనుభవం ఎదురైంది . తాజాగా ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి కి ప్రజల నుండి నిరసన వ్యక్తమైంది. రామంతపూర్ కు చెందిన మహిళలు ఎమ్మెల్యే పై మండిపడ్డారు. మూడు రోజుల నుండి తమకు తిండి, నీళ్లు లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు . మీ పేరు రాసి చచ్చిపోతాం అంటూ అసహనం వ్యక్తం చేశారు.
తనపై ఫైర్ అయిన మహిళకు నచ్చజెప్పే ప్రయత్నం చేసిన ఎమ్మెల్యే
ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి సదరు మహిళకు సర్ది చెప్పాలని ప్రయత్నించారు. కానీ ఆ మహిళ వినిపించుకోలేదు. మీరు చెప్పే ముచ్చట్లు మాకు అవసరం లేదంటూ ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో మీరు అలా మాట్లాడితే నేనేం చెప్పను అంటూ అసహనం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి . వర్షం వల్ల ఏర్పడిన విపత్కర పరిస్థితికి హైదరాబాద్ మొత్తం పరిస్థితి ఇదే విధంగా ఉందని, నగరం మొత్తం బాధపడుతోందని మహిళకు సర్ది చెప్పే ప్రయత్నం చేసాడు ఎమ్మెల్యే. ఈ పరిస్థితి మీ ఒక్క ఇంటికే వచ్చింది కాదంటూ ఆ మహిళను శాంతింప చేసే ప్రయత్నం చేశారు.
తిట్టిపోసిన మహిళ... ఎమ్మెల్యే పలాయనం
కానీ ఆ మహిళ రెట్టించిన స్వరంతో ఎమ్మెల్యేను నిలదీసింది. ఇక చేసేదేమి లేక ఎమ్మెల్యే అక్కడి నుంచి పలాయనం చిత్తగించారు . ఈ సమయంలో కూడా మహిళ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ఓట్ల కోసం వచ్చినప్పుడు ఇలాగే వెళ్ళిపోతారా అంటూ నిప్పులు చెరిగారు.గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు దగ్గర పడుతుంటే టిఆర్ఎస్ పార్టీ ఈసారి గ్రేటర్లో కూడా పార్టీ జెండా రెపరెపలాడించాలని తహ తహ లాడుతోంది.
అధికార పార్టీకి తలనొప్పిగా హైదరాబాద్ వరదలు
ఊహించని విధంగా భారీ వర్షాలు హైదరాబాదును ముంచెత్తడంతో అధికార పార్టీ నేతలకు ప్రజలనుండి వ్యతిరేకత ఎదురవుతోంది. టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు, కార్పొరేటర్లకు చేదు అనుభవం మిగులుతోంది. హైదరాబాదులో భారీ వర్షాల కారణంగా నెలకొన్న తాజా పరిస్థితిపై, అధికారులు, అధికార పార్టీ నాయకులు ఏం చేయలేకపోతున్నారని ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. కనిపిస్తే చాలు తిట్టిపోస్తున్నారు. వరదల కారణంగా హైదరాబాద్ లో నెలకొన్న తాజా పరిస్థితి అధికార పార్టీకి తలనొప్పిగా మారింది.