యురేనియం తవ్వకాలతో టీఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధం లేదు.. మండలిలో కేటీఆర్ వివరణ
హైదరాబాద్ : యురేనియం తవ్వకాలతో టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదన్నారు మంత్రి కేటీఆర్. శాసనమండలి సమావేశాల్లో భాగంగా ప్రశ్నోత్తరాల సమయంలో యూరేనియం తవ్వకాలపై పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. యురేనియం తవ్వకాల విషయంలో రాద్దాంతం అనవరసమని.. ఆ విషయంలో ప్రజా ప్రతినిధులు బాధ్యతతో మాట్లాడాలని కోరారు.
సీఎం కేసీఆర్ పర్యావరణ ప్రేమికుడని కితాబిచ్చిన కేటీఆర్.. తెలంగాణ ప్రభుత్వం యురేనియం తవ్వకాల విషయంలో ఎలాంటి తప్పు చేయలేదు.. ఇకపై చేయదు కూడా అంటూ వివరణ ఇచ్చారు. యురేనియం తవ్వకాలపై సీఎం కేసీఆర్తో పాటు మంత్రివర్గంతో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్పుకొచ్చారు.
నల్లమలలో యురేనియం నిక్షేపాలు ఉన్నప్పటికీ.. వాటిని వెలికి తీసే క్రమంలో ఎలాంటి అనుమతి ఇవ్వబడదనే కండిషన్తో 2016 సంవత్సరంలో అటవీ శాఖ మంత్రివర్యులు ఆదేశాలు జారీ చేసిన విషయం గుర్తు చేశారు. అదే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం యురేనియం తవ్వకాలకు సంబంధించి నల్లమలలో ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నప్పుడు యురేనియం కోసం అన్వేషణ చేయించిందని తెలిపారు.