ఆర్మీని రంగంలోకి దింపండి: వలసకూలీల తరలింపుపై కేంద్రానికి ఉత్తమ్ సూచన..
లాక్ డౌన్ వల్ల పనిలేక వలసకూలీలు సొంతూళ్లకు బాట పడుతున్నారు. అయితే వారిని ఆదుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని టీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఉన్న చోట ఉండేందుకు ప్రభుత్వాలు ఎందుకు భరోసా కల్పించడం లేదు అని ప్రశ్నించారు. పని లేక, జేబులో డబ్బుల్లేక వారు ఇబ్బందులు పడుతున్నారని గుర్తుచేశారు. తినడానికి తిండిలేక ఆకలితో అలటిస్తున్నారని పేర్కొన్నారు.
జగన్తో కేసీఆర్ రాజీపడ్డారా..? ఎందుకు నోరుమెదపడం లేదు: ఉత్తమ్
వలసకూలీలను ఆదుకునేందుకు ప్రభుత్వాలు ముందుకురాకపోవడం శోచనీయమన్నారు. దేశంలో భారీగా ఆహార నిల్వలు ఉన్నాయని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. వాటిని ఎందుకు పంచడం లేదు అని ప్రశ్నించారు. వలసకూలీ నెల గడించేందుకు సరుకులు, నగదు ఇస్తే.. వారు ఎందుకు వందల కిలోమీటర్లు నడుస్తారని ప్రశ్నించారు. అలా ఇవ్వని పక్షంలో ఆర్మీని రంగంలోకి దింపితే బాగుండేందని పేర్కొన్నారు. దీంతో కూలీల గమ్యస్థానాలకు ఇండియన్ ఆర్మీ క్షేమంగా చేరుస్తుందని తెలిపారు.
కూలీల వెతలు పట్టించుకోరు అని విపక్షాలనే తప్పుపడతారని ఉత్తమ్ ఆరోపించారు. తమ అధినేత్రి సోనియాగాంధీ పిలుపుతో.. వలస కార్మికులను తామే తరలిస్తున్నామని తెలిపారు. కానీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకుంటే.. కూలీల తరలింపు సమస్య ఉండదని అభిప్రాయపడ్డారు. ఆర్మీ సాయం తీసుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదని.. ఆ విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించాలని సూచించారు.