అంజనీ వేస్ట్ ఫెలో.. ఓవరాక్షన్ చేస్తే అంతుచూస్తాం.. సీపీపై ఉత్తమ్ ఫైర్
హైదరాబాద్ లో కాంగ్రెస్ నాయకులపై పోలీసుల చర్య ఉద్రిక్తతకు దారితీసింది. గాంధీభవన్ వద్ద కాంగ్రెస్ 135వ ఆవిర్భావదినోత్సవంలో పాల్గొనేందుకు వెళ్లిన కార్యకర్తల్నీఅరెస్టు చేశారు. దీంతో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అగ్గిమీద గుగ్గిలమయ్యారు. హైదరాబాద్ కమిషనర్ ఆప్ పోలీస్ అంజనీ కుమార్ పై తీవ్రస్థాయిలో ఆరోపణలు, హెచ్చరికలు చేశారు. సీపీని ఇంటికి పంపేదాకా ఊరుకోబోమని, గవర్నర్ ద్వారా ముందుకెళతామని చెప్పారు.
వేస్ట్ ఫెలో.. అతనికన్నీ చెడు అలవాట్లే..
‘‘అంజనీ కుమార్ అనేవాడు వేస్ట్ ఫెలో. చెడు అలవాట్లున్న వ్యక్తికి సీపీ ఎలా అయ్యాడో తెలియదు. ఈ పోస్టులో ఉండటానికి అతను అన్ ఫిట్. హైదరాబాద్ కు గొప్ప చరిత్ర ఉంది. ఎంతోమంది కమిషనర్ లు గొప్ప పేరుతెచ్చుకున్నారు. ఇతనిలాంటి పనికిమాలిన వ్యక్తిని ఎప్పుడూ చూడలేదు. ఎంత దమ్ము, ధైర్యముంటే.. కాంగ్రెస్ పార్టీ ఆఫీసుకొచ్చి మా కార్యకర్తల్ని అరెస్టు చేస్తారు? ఐపీఎస్ గా నువ్వు అన్ ఫిట్. ఐపీఎస్ బదులు కల్వకుంట్ల పోలీస్ సర్వీస్(కేపీఎస్) అని పెట్టుకో. ఎక్కడినుంచో ఉద్యోగం చేసుకోడానికి వచ్చావ్.. పనిచేసుకుని కామ్ గా వెళ్లిపోవాలె. ఓవరాక్షన్ చేస్తే వదిలిపెట్టం.. అంతుచూస్తాం జాగ్రత్త..‘‘ అంటూ ఉత్తమ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
సెక్షన్ 8 ద్వారా సీపీని ఇంటికి పంపిస్తాం..
హైదరాబాద్ లో ఆర్ఎస్ఎస్, ఎంఐఎం సభలకు మాత్రం పర్మిషన్ ఇస్తున్న సీపీ అంజనీ కుమార్.. కాంగ్రెస్ మీటింగ్ ను.. అదికూడా గాంధీభవన్ లో జరుగుతున్న సత్యాగ్రహ దీక్షను అడ్డుకోవడమేంటని ఉత్తమ్ ప్రశ్నించారు. సీపీ వ్యవహారాన్ని అంత సువులుగా వదిలిపెట్టబోమని, ఆయనను ఇంటికి పంపేలా గవర్నర్ తమిళిసైకి ఫిర్యాదు చేస్తామని, అతని అక్రమాలు, అవినీతికి సంబంధించిన ఆధారాలను గవర్నర్ కు అందజేస్తామని టీపీసీసీ చీఫ్ చెప్పారు. సోమవారమే గవర్నర్ అపాయింట్మెంట్ ఖరారైందని తెలిపారు. విభజన చట్టంలోని సెక్షన్ 8 ప్రకారం.. హైదరాబాద్ లో లా అండ్ ఆర్డర్ వ్యవహారాలన్నీ గవర్నర్ కంట్రోల్ లో ఉంటాయని, ఆమె ద్వారానే సీపీకి బుద్ధిచెబుతామని ఉత్తమ్ అన్నారు.
అసలేం జరిగిందంటే..
కేంద్ర సర్కారు విధానాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ శనివారం తలపెట్టిన ‘దేశ్ బచావో ర్యాలీ'కి పోలీసులు అనుమతి నిరాకరించారు. దీనిపై సీపీ అంజన్ కుమార్ కు, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ కు మధ్య లేఖల సంవాదం నడిచింది. చివరికి.. పోలీసుల చెప్పిన రూట్ లోనే ర్యాలీ తీస్తామని, స్లోగన్లు లేకుండా, మౌనయాత్ర చేపడతామని అభ్యర్థించినా సీపీ అంగీకరించలేదని ఉత్తమ్ తెలిపారు. కాంగ్రెస్ నేత కామెంట్లు ప్రభుత్వ, పోలీస్ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.