గల్లీ మే కుస్తీ.. ఢిల్లీ మే దోస్తి.. టీఆర్ఎస్- బీజేపీపై ఉత్తమ్ విమర్శలు
సీఎం కేసీఆర్పై ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందని దుయ్యబట్టారు. ఐకేపీ కేంద్రాల ఎత్తివేతపై ధ్వజమెత్తారు. దీనిపై కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చేపడుతోన్న సంగతి తెలిసిందే. రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని ఆయన చెప్పారు. కేసీఆర్ దుర్మార్గమైన పాలన చేస్తున్నారని ఉత్తమ్ విమర్శించారు.
రైతులు పండించే ప్రతి పంటను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి గ్రామంలో ఐకేపీ కేంద్రాల ద్వారానే కొనుగోలు జరగాలని అన్నారు. వివాదాస్పద వ్యవసాయ చట్టాలపై వ్యతిరేంకగా ఉన్న కేసీఆర్.. ఢిల్లీ వెళ్లొచ్చిన తర్వాత మాట మార్చారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వానికి కేసీఆర్ ఎందుకు భయపడుతున్నారని చెప్పారు. రైతుల పంట ఉత్పత్తులను కొనుగోలు చేసేంత వరకు తమ పోరాటం చేస్తామని స్పష్టంచేశారు. తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ జాగీరు కాదన్నారు.
బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య ఒప్పందం బయటపడిందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏ చట్టాన్ని తీసుకొచ్చినా కేసీఆర్ వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. గల్లీమే కుస్తీ, ఢిల్లీమే దోస్తీ అన్నట్టుగా ఈ పార్టీల వ్యవహారం ఉందని విమర్శించారు. నాగార్జునసాగర్ ఉపఎన్నికలో బీజేపీకి డిపాజిట్ కూడా దక్కదన్నారు. ఐదు దశాబ్దాలుగా ప్రజాసేవ కోసం జానారెడ్డి పాటుపడ్డారని...అలాంటి వ్యక్తిని గెలిపించుకోవాలని ఓటర్లను కోరారు. సాగర్ ఉప ఎన్నిక ఫలితంతో టీఆర్ఎస్- బీజేపీకి దిమ్మతిరిగి మైండ్ బ్లాంకవుతోందని చెప్పారు.