కరోనా: పూర్తిస్థాయిలో పరీక్షలు చేయడం లేదు, రైతు సమస్యలపై గవర్నర్తో ఉత్తమ్ బృందం డిస్కషన్..
తెలంగాణ ధనిక రాష్ట్రమని చెప్పే సీఎం కేసీఆర్ ప్రభుత్వం ఆదాయంపై శ్వేత పత్రం విడుదల చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. వలసకూలీలు వెళ్లిపోతే ఆయా రంగాల్లో రాష్ట్రానికి నష్టం జరుగుతోందని అభిప్రాయపడింది. పేదలకు నాణ్యమైన బియ్యం అందజేయాలని కోరింది. సోమవారం పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన.. భట్టి విక్రమార్క, మర్రి శశిధర్ రెడ్డి తదితరులు గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు సమస్యలపై ఆమెతో చర్చించారు.
కందిపప్పు ఏదీ..?
కేంద్ర ప్రభుత్వ తీరును కూడా ఉత్తమ్ బృందం తప్పుపట్టింది. పేదలకు కిలో కంది పప్పు ఇస్తామని మార్చి 26వ తేదీన ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారని గుర్తుచేశారు. కానీ ఇప్పటివరకు ఇవ్వలేదని పేర్కొన్నారు. వివిధ అంశాలపై రాష్ట్ర ప్రభుత్వ తీరును ఎండగట్టారు. రాష్ట్రంలో కరోనా పరీక్షలు పూర్తిస్థాయిలో చేయడం లేదని ఉత్తమ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో పరీక్షలు చేసే సామర్థ్యం ఉన్న ఎందుకు చేయడం లేదు అని ప్రశ్నించారు. తెలంగాణ కంటే చిన్న రాష్ట్రాలు కూడా పరీక్షలు చేస్తున్నాయని తెలిపారు. కానీ రాష్ట్రంలో మాత్రం జరగడం లేదు అని.. సీఎం కేసీఆర్ ఏకపక్ష ధోరణితో ముందుకెళ్తున్నారని పేర్కొన్నారు.
ఎందుకు పరీక్షలు చేయరు..?
ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ను ప్రభుత్వం పాటించడం లేదన్నారు. రాష్ట్రంలో చనిపోయిన వారికి ఎందుకు కరోనా పరీక్షలు చేయొద్దని ఆదేశాలు ఇచ్చారో అర్థం కావడం లేదన్నారు. సరిగా పరీక్షలు చేసి.. తెలంగాణ కరోనా ప్రీ కావాలని తాము కోరుకుంటున్నామని ఉత్తమ్ పేర్కొన్నారు. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబానికి రూ.5 వేలు ఇవ్వాలని కోరామని చెప్పారు. పేదలకు నాణ్యమైన బియ్యం అందించాలని ప్రభుత్వాన్ని కోరామని.. కానీ స్పందించలేదని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తోన్న రేషన్ బియ్యం గవర్నర్కి చూపించామని చెప్పారు.
తడిసిన ధాన్యం..
బస్తాలు లేక వరి ధాన్యం కొనుగోళ్లు నిలిచిపోయాయని ఉత్తమ్ తెలిపారు. బస్తాలను ముందే సమకూర్చడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. అకాల వర్షంతో వరి ధాన్యం తడిసిపోయిందని గుర్తుచేశారు. ఆ ధాన్యాన్ని కొనుగోలు చేసి.. రైతులను ఆదుకోవాలని కోరారు. హమాలీలు చార్జీలను రైతులు కాకుండా.. ప్రభుత్వమే భరించాలని సూచించారు. కంది పంట విక్రయించిన వారికి ఇప్పటివరకు నగదు జమచేయలేదని ఉత్తమ్ గుర్తుచేశారు.
Recommended Video