త్వరలో ఎమ్మెల్యేగా ఉత్తమ్ రాజీనామా..! బరిలో ఆయన సతీమణి పద్మావతి, జానారెడ్డి..!!
హైదరాబాద్ : తెలంగాణలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. నల్లగొండ జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గంలో త్వరలో ఉప ఎన్నికలు రానున్నాయి. ఆరు నెలల్లోగా ఇక్కడ ఉప ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. ఇక్కడ నుంచి గత అసెంబ్లీ ఎన్నికల్లో టీపీసీసీ అధ్యక్షుడు ఉతమ్కుమార్రెడ్డి ఎన్నికయ్యారు. గులాబీ పార్టీ గాలి బలంగా వీచినా ఆయన తట్టుకుని నిలబడ్డారు. అయితే లోక్సభ ఎన్నికల్లో నల్లగొండ లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్కు అభ్యర్థులెవరూ ముందుకు రాకపోవడంతో స్వయంగా ఆయనే బరిలో దిగారు. అనూహ్యంగా విజయం సాధించారు. నల్లగొండలోని రెండు లోక్సభ స్థానాలు కూడా కాంగ్రెస్ ఖాతాలోనే పడ్డాయి.
నల్లగొండలో ఉత్తమ్కుమార్రెడ్డి, భువనగరి నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గెలిచారు. ఇప్పుడు ఉత్తమ్ తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. హుజూర్నగర్ స్థానంలో ఆయన రాజీనామా చేయనున్నారు. దీంతో ఆరు నెలల్లోగా ఇక్కడ ఉప ఎన్నికలు రానున్నాయి. ఈ స్థానం నుంచి ఉత్తమ్ సతీమణి పద్మావతి పోటీ చేసే అవకాశం ఉంది. ఆమె గత అసెంబ్లీ ఎన్నికల్లో కోదాడ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. దీంతో భర్త రాజీనామాతో ఖాళీ అయ్యే స్థానంలో ఆమె బరిలోకి దిగే అవకాం ఉంది. మరోవైపు ఇక్కడ నుంచి టికెట్ కోసం సీనియర్ నేత జానారెడ్డి కూడా ప్రయత్నించే అవకాశం ఉంది.