పోతిరెడ్డిపాడును జగన్ కు అప్పగించిన కేసీఆర్ .. దక్షిణ తెలంగాణా ఎడారి : వీహెచ్ ఫైర్
ఏపీ తెలంగాణా రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదం రెండు రాష్ట్రాలలోని ప్రతిపక్ష పార్టీలకు ప్రభుతాలను విమర్శించే ఆయుధంగా మారింది . ఏపీ ప్రభుత్వం జారీ చేసిన 203 జీవో తెలుగు రాష్ట్రాల మధ్య వివాదానికి కేంద్రబిందువుగా మారటంతో ఇప్పుడు ఇది రాజకీయ దుమారానికి కారణం అయింది . దీనిపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి.హనుమంతరావు తనదైన శైలిలో స్పందించారు. దక్షిణ తెలంగాణాను ఎడారి చెయ్యటానికి సీఎం కేసీఆర్ పోతిరెడ్డిపాడును ఏపీ సీఎం జగన్ కు అప్పగించేశారంటూ ఆయన ఫైర్ అయ్యారు . 203 జీవో అమలైతే శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులు ఖాళీ కావడం ఖాయమన్నారు వీహెచ్ .
సాగునీటి ప్రాజెక్ట్ లపై సీఎం జగన్ దృష్టి .. విమర్శలపై చంద్రబాబు దృష్టి : స్పీకర్ తమ్మినేని
నల్గొండ జిల్లాకు ఏపీ నిర్ణయంతో తీవ్ర నష్టం జరుగుతుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు . ఉమ్మడి ప్రాజెక్ట్ పై ఏపీ ఏకపక్ష నిర్ణయం ఎలా తీసుకుంటుందని ఆయన ప్రశ్నించారు . కృష్ణా జలాలు అందని నేపథ్యంలో దక్షిణ తెలంగాణ ఎడారిగా మారబోతోందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఏదేనీ అంశంపై గట్టిగా ప్రశ్నిస్తే ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారని వీహెచ్ ఆరోపించారు. ఇక అధికారం ఎవ్వరికీ శాశ్వతం కాదని, కేసీఆర్ ఈ విషయం గుర్తు పెట్టుకోవాలన్నారు . ఒకప్పుడు రెండు సీట్లు ఉన్న బీజేపీ ఇపుడు దేశాన్ని ఏలుతోందని గుర్తు చేశారు. గతంలో కాంగ్రెస్, టీడీపీలతో పొత్తు పెట్టుకున్నప్పుడు ఎన్ని సీట్లు వచ్చాయో కేసీఆర్ కు తెలీదా అని వీహెచ్ ప్రశ్నించారు .
ఇక ఏది ప్రశ్నించినా సరే సీఎం కేసీఆర్ మాట్లాడుతున్న తీరు సరిగా లేదని విమర్శించారు . అటు కరోనా అంశంపైనా ఆయన తన అభిప్రాయాలు వెల్లడించారు.కరోనా కట్టడిలో కేసీఆర్ ఉట్టి మాటలు చెబుతున్నారని, కేంద్రం ఇచ్చిన నిధులకు, దాతలు ఇచ్చిన విరాళాలకు ఇప్పటి వరకు లెక్కా పత్రం లేదన్నారు. లెక్క చెప్పాల్సిన అవసరం ఉందన్నారు . పేదలకు ఇచ్చిన 1500 రూపాయలను వైన్ షాపులు తెరవడం ద్వారా ప్రభుత్వమే లాక్కుందని మండిపడ్డారు వీ హన్మంతరావు .