ఉత్తర ద్వార దర్శనం.. కిటకిటలాడుతున్న ఆలయాలు.. వైకుంఠ ఏకాదశి విశిష్టత
Recommended Video
హైదరాబాద్ : వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా వైష్ణవ ఆలయాలకు భక్తులు పోటెత్తుతున్నారు. ఉత్తర ద్వార దర్శనానికి ఉదయం నుంచే ఆలయాల దగ్గర క్యూ కట్టారు. యాదాద్రి, భద్రాద్రితో పాటు రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాలు భక్తజనులతో కిటకిటలాడుతున్నాయి. హైదరాబాద్ హిమాయత్ నగర్ లోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో తెల్లవారుజామునుంచే ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. స్వామివారి దర్శనానికి భక్తులు పెద్దసంఖ్యలో బారులు తీరారు. హోమాలు, జపధాన్యాలతో దేవాలయాలు కొత్తశోభ సంతరించుకున్నాయి.
వైకుంఠ ఏకాదశి శ్రీమన్నారాయణుడికి ప్రీతిపాత్రమైన రోజు. ఇవాళ ఉత్తర ద్వారం నుంచి ముక్కోటి దేవతలు విష్ణుమూర్తిని దర్శించుకుంటారనేది ప్రతీతి. సూర్యభగవానుడు ఉత్తరాయణ కాలానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశిగా పిలుస్తారు. దీనికి ముక్కోటి ఏకాదశిగా మరో పేరుంది. ఈరోజు మూడు కోట్ల దైవగణంతో గరుడ వాహనంపై మహావిష్ణువు భూలోకానికి దిగొచ్చి భక్తులకు దర్శనమిస్తారట. అందుకే ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చిందని ప్రతీతి.