రూ.40 లక్షల అప్పు, కిరాయి కట్టలేని స్థితి..?, ఎల్బీనగర్లో ఆస్పత్రి ఎండీ ఆత్మహత్య, నలుగురే కారణం..
హైదరాబాద్ నగర నడిబొడ్డున అజయ్ అనే వైద్యుడు ఆత్మహత్య చేసుకున్నాడు. తన సూసైడ్కు నలుగురు కారణమని డైరీలో రాశారు. ఆర్థిక ఇబ్బందులు, నలుగురి వేధింపులతోనే మానసికంగా కృంగిపోయాడని తెలుస్తోంది. తాను ఎప్పుడూ చనిపోయినా ఆ నలుగురే కారణమని పేర్కొనడంతో.. కుటంబసభ్యులు వారిపై ఫిర్యాదు చేశారు. ఘటనాస్థలం నుంచి వైద్యుడి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
15 రోజుల క్రితం క్లోజ్..
ఎల్బీ నగర్లో గల ఓంకార్ నగర్లో వైష్ణవి ఆస్పత్రి ఉంది. డాక్టర్ అజయ్ ఆస్పత్రి ఎండీ. గత మూడేళ్ల నుంచి ఆస్పత్రిని నిర్వహిస్తున్నారు. రెండంతస్తుల భవనంలో ఇక్కడి ప్రజలకు వైద్యం అందిస్తున్నారు. అయితే ఆస్పత్రిని 15 రోజుల క్రితం మూసివేశారు. తమ కిరాయి ఇవ్వకపోవడంతో తప్పడం లేదని యాజమాని కరుణారెడ్డి స్పష్టంచేశారు. కరుణారెడ్డితోపాటు మరో ముగ్గురు తనను వేధించారని అజయ్ పేర్కొన్నారు.
వీరే ఆ నలుగురు..
ఇటీవల ఆస్పత్రి మూసివేయడంతో కుంగిపోయాడు. కిరాయి కోసం కరుణారెడ్డి ఒత్తిడి తీసుకురావడంతో తట్టుకోలేకపోయాడు. కరుణారెడ్డి బావమరిది కొండల్ రెడ్డి కూడా హరాస్ చేసేవాడు. వీరిద్దరితోపాటు సరసత్వీనగర్ కాలనీ ప్రెసిడెంట్ మేఘారెడ్డి, కాంగ్రెస్ నేత శివకుమార్ కూడా కిరాయి కోసం వేధించడం ప్రారంభించారు. కిరాయితోపాటు రూ.40 లక్షల వరకు అజయ్కు అప్పు ఉంది. రెంట్ కట్టలేక, ఆస్పత్రి నడపకలేక ఇబ్బందికి గురైన అజయ్.. చివరికి ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది.
విగతజీవిగా..
మంగళవారం తెల్లవారుజామున ఆస్పత్రిలో సెల్లార్లో అజయ్ ఆత్మహత్య చేసుకున్నాడు. అక్కడే డైరీలో సూసైడ్ నోట్ కూడా రాశాడు. అజయ్ చనిపోయాడని తెలిసి కుటుంబసభ్యులు రోదిస్తున్నారు. డైరీలో రాసిన నలుగురి వల్లే తన భార్య ఆత్మహత్య చేసుకున్నాడని భార్య అంటున్నారు. వారిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. ఉదయం బాబును స్కూల్లో దింపేసి ఆస్పత్రి వద్దకొచ్చి చూడగా అజయ్ విగతజీవిగా మారారని వాపోయారు.
రక్తపు మరకలు..?
అజయ్ ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థలంలో రక్తపు మరకలు కనిపించాయి. దీంతో ఏం జరిగింది..? ఆయన సూసైడ్ చేసుకున్నారా..? లేదంటే ఎవరైనా హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారా అనే అనుమనాలు నెలకొన్నాయి. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా ఏం జరిగిందనే అంశంపై క్లారిటీ వస్తుంని పోలీసులు స్పష్టంచేశారు. అప్పటివరకు ఏం జరిగిందనే అంశంపై స్పష్టత లేదని తెలిపారు.