వనస్థలిపురం ఏటీఎం క్యాష్ బాక్స్ దొంగలు దొరికారు.. 14 మందిలో నలుగురు..! (వీడియో)
Recommended Video
హైదరాబాద్ : రాష్ట్ర రాజధానిలో దొంగలు రెచ్చిపోయారు. అత్యంత రద్దీగా ఉన్న ప్రాంతంలో చోరీకి పాల్పడ్డారు. చకచకా క్షణాల్లో లక్షలకు లక్షలు దోచేశారు. హైదరాబాద్ వనస్థలిపురంలో ఏటీఎం నగదు సమకూర్చే సిబ్బందిని ఏమార్చి చాలా ఈజీగా నగదు నొక్కేశారు. మీ డబ్బులు కిందపడ్డాయంటూ సెక్యూరిటీ గార్డును బురిడీ కొట్టించి అమాంతంగా ఓ క్యాష్ బాక్స్ ను ఎత్తుకెళ్లారు. చిల్లర పడేసి లక్షలు మాయం చేశారు. మే నెల మొదటివారంలో ఈ జరిగిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. రాచకొండ పోలీసులు ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎట్టకేలకు నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు.
మే నెలలో భారీ చోరీ.. అటెన్షన్ డైవర్ట్ చేసి..!
రాష్ట్ర రాజధానిలో మంగళవారం (07.05.2019) ఉదయం జరిగిన భారీ చోరీ కలకలం రేపింది. ఏటీఎంలలో నగదు నింపే సిబ్బందికి మస్కా కొట్టి పెద్దమొత్తంలో దోచుకెళ్లారు. బేగంపేటలోని ఓ ప్రైవేట్ సంస్థ.. ఏటీఎం యంత్రాల్లో నగదు పెట్టే కార్యకలాపాలు నిర్వహిస్తోంది. అందులోభాగంగా ఎప్పటిలాగే మంగళవారం ఉదయం తమ వాహనంలో నగదు పెట్టెలతో బయలుదేరారు. ఆబిడ్స్, దిల్సుఖ్నగర్లోని ఏటీఎంల్లో క్యాష్ పెట్టిన అనంతరం వనస్థలిపురం చేరుకున్నారు.
అక్కడ పనామా చౌరస్తాలోని ఓ ప్రైవేట్ బ్యాంకు ఏటీఎంలో డబ్బు పెట్టేందుకు తమ వాహనాన్ని పక్కకు నిలిపి ఉంచారు. అప్పటికే అక్కడ మాటు వేసి ఉన్న దొంగలు క్షణాల్లో తమ పని కానిచ్చారు. ఆ వాహనంలో మొత్తం నలుగురు సిబ్బంది ఉన్నారు. డ్రైవర్, సెక్యూరిటీ గార్డుతో పాటు మరో ఇద్దరున్నారు. వాహనాన్ని అక్కడ నిలిపి డ్రైవర్ అలా పక్కకు వెళ్లాడు. మిగతా ఇద్దరు ఏటీఎంలో డబ్బు పెట్టడానికి వెళ్లారు. ఇక మిగిలింది గార్డు ఒక్కరే. అదే అదనుగా దొంగలు తమ చేతివాటం ప్రదర్శించారు. అతడిని డైవర్ట్ చేసి ఎంచక్కా 58 లక్షలతో చెక్కేశారు.
రాంజీ నగర్ గ్యాంగ్ అరెస్ట్.. రాచకొండ సీపీ
వనస్థలిపురం ఏటీఎం క్యాష్ బాక్స్ దోపిడీ కేసు చేధించారు రాచకొండ పోలీసులు. మొదటినుంచి అనుమానిస్తున్నట్లుగానే రాంజీనగర్ గ్యాంగ్ ముఠా పనే అని తేలింది. రాచకొండ కమిషనరేట్ పరిధిలోని వనస్థలిపురంపోలీసులు, ఎస్వోటీ పోలీసులు కలిసి ఈ కేసు చిక్కుముడి విప్పారు. దాదాపు మూడు నెలలుగా ఈ కేసును ఫాలో అప్ చేస్తూ ఎట్టకేలకు నిందితులను గుర్తించారు. మొత్తం 14 మంది ముఠాసభ్యుల్లో నలుగురిని అరెస్ట్ చేశారు. ఆ మేరకు రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ మీడియాకు వివరాలు వెల్లడించారు.
ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు మూడు నాలుగు సార్లు తమిళనాడుకు వెళ్లినట్లు చెప్పారు సీపీ. ఆ క్రమంలో చాలా ఇబ్బందులు ఎదురైనట్లు తెలిపారు. మొత్తానికి పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి నిందితుల్లో కొందరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. రాంజీనగర్ ముఠాకు నేతృత్వం వహిస్తున్న దీపక్ అలియాస్ దీపూతో పాటు సత్యరాజ్, యోగరాజ్, సురేశ్ ను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు.
లంచం.. క్యాష్లెస్ యవ్వారం.. కరీంనగర్ ఎంవీఐ స్టైలే వేరుగా..!
ఊరంతా అదే పని.. డైవర్ట్ చేస్తూ దోపిడీలు
ఏటీఎం బాక్స్ చోరీ తర్వాత రైలు ప్రయాణం ద్వారా తొలుత సొంతూరుకు వెళ్లారని.. ఆ తర్వాత అక్కడినుంచి మాయమైనట్లు చెప్పుకొచ్చారు సీపీ. ఈ ముఠాలో ప్రధానంగా తమిళనాడు రాంజీనగర్ ప్రాంతానికి చెందిన 11 మంది సభ్యులతో పాటు పశ్చిమ బెంగాల్కు చెందిన మరో ముగ్గురు వీరితో జత కట్టినట్లు చెప్పారు. రాంజీనగర్ అనే ప్రాంతంలో చాలామంది ఇలాంటి దోపిడీలకు పాల్పడతారని తెలిపారు. అటెన్షన్ డైవర్ట్ చేస్తూ దోపిడీ చేయడమే వారు వృత్తిగా మలచుకున్నట్లు వివరించారు.
ఈ కేసుకు సంబంధించి నిందితుల నుంచి 7 లక్షల 70 వేల రూపాయల నగదు, ఇతర వస్తువులు రికవరీ చేసినట్లు చెప్పారు. అందులో 4 లక్షల 10వేల రూపాయల నగదుతో పాటు ఇండికా కారు ఉందన్నారు. ఈ ముఠా ఇదివరకు ఏపీ, తమిళనాడు, ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాల్లో చోరీలు చేసినట్లు తెలిపారు. మిగతా నిందితులను కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తామన్నారు. ఈ కేసును చేధించిన పోలీసులను అభినందించారు సీపీ.