గుడ్న్యూస్: వీసీ, అధ్యాపక పోస్టుల భర్తీ, అసెంబ్లీలో విద్యాశాఖ మంత్రి ప్రకటన..
నిరుద్యోగులకు తీపికబురు. త్వరలో అధ్యాపక పోస్టులను భర్తీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. సభలో సభ్యులు అధ్యాపక నియామకాల గురించి ప్రశ్న అడగగా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమాధానం ఇచ్చారు. రాష్ట్రంలో గల వర్సిటీలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం లేదని స్పష్టం చేశారు. త్వరలో వర్సిటీలకు వీసీలు, అధ్యాపకుల పోస్టులను భర్తీ చేస్తామని చెప్పారు. తెలంగాణ స్టేట్ ప్రైవేటు యూనివర్సిటీస్ బిల్లుపై చర్చలో సభ్యులు అడిగిన ప్రశ్నకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి జవాబిచ్చారు.
వీసీ/ అధ్యాపక నియామకాలకు సంబంధించి అనుమతులు ఇచ్చి చాలా రోజులవుతుందని మంత్రి తెలిపారు. కానీ న్యాయపరమైన సమస్య రావడంతో ఆలస్యం జరుగుతోందన్నారు. రాష్ట్రంలో ఉన్నత విద్య చదవాలని కోరుకుంటున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోందని తెలిపారు. రాష్ట్రానికి చెందిన విద్యార్థులు ఇతర రాష్ట్రాలకు వెళుతున్నారని తెలిపారు. విద్యార్థుల నుంచి వస్తోన్న డిమాండ్లను దృష్టిలో ఉంచుకుని ప్రైవేటు వర్సిటీల ప్రతిపాదన తీసుకొచ్చామని సబిత ఇంద్రారెడ్డి వెల్లడించారు.
రాష్ట్రంలో ప్రైవేటు వర్సిటీలకు సంబంధించి 16 ప్రతిపాదనలు రాగా, 8 ప్రతిపాదనలను ప్రభుత్వం అంగీకరించిందని తెలిపారు. ఐదింటికి ఆమోదం కూడా తెలిపామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి వివరించారు. మరో మూడు ప్రైవేట్ యూనివర్సిటీలకు సంబంధించి త్వరలోనే ఆమోదం లభిస్తుందని చెప్పారు. కాలానుగుణంగా ప్రైవేటు వర్సిటీల అవసరం ఉందని కేంద్ర ప్రభుత్వం కూడా గుర్తించిందన్నారు. దేశవ్యాప్తంగా 53 సెంట్రల్ వర్సిటీలు, 412 రాష్ట్ర విశ్వవిద్యాలయాలు, 361 ప్రైవేటు విశ్వవిద్యాలయాలు, 124 డీమ్డ్ వర్సిటీలు ఉన్నాయని మంత్రి సబితా ఇంద్రారెడ్డి సభకు వివరించారు.