ఇల్లు కట్టుకోవడం ఇకపై ఈజీ ప్రాసెస్ కావాలె.. టౌన్ ప్లానింగ్కు త్వరలో కొత్త చట్టం.. మంత్రి కేటీఆర్
ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించాలన్న లక్ష్యంతోనే కొత్త పురపాలక చట్టాన్ని పక్కాగా అమలు చేస్తామని పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తెలిపారు. ఇల్లు కట్టుకోవాలనుకునే వ్యక్తి సులభంగా అత్యంత పారదర్శకంగా, వేగంగా భవన నిర్మాణ అనుమతులను పొందే విధంగా నూతన విధానం తీసుకురానున్నట్లు ఆయన తెలిపారు. శుక్రవారం హైదరాబాద్ లోని బుద్దభవన్ లో టౌన్ ప్లానింగ్ సిబ్బంది రాష్ట్ర స్థాయి సమావేశంలో మంత్రి మాట్లాడారు. కొత్త విధానంలో.. 75 గజాల లోపు భవన నిర్మాణం చేపట్టే వారికి కేవలం రిజిస్ర్టేషన్ చేసుకుంటే సరిపోతుందని, 600 గజాలలోపు భవన నిర్మాణాలకు సెల్ఫ్ డిక్లరేషన్ విధానం, 600 గజాలపైన భవన నిర్మాణ అనుమతులకు సింగిల్ విండో పద్ధతిలో అనుమతులకు ఈ నూతన విధానం వీలు కల్పిస్తుందని మంత్రి తెలిపారు.
జనం కూడా జాగ్రత్తగా ఉండాలి
అధికారులపై ప్రజలకు విశ్వాసం పెరిగేలా కొత్త టౌన్ ప్లానింగ్ చట్టం తీసుకువస్తున్నామన్న మంత్రి కేటీఆర్.. దీన్ని దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. ‘‘ప్రజలు ఈ విధానాన్ని దుర్వినియోగం చేసి, తప్పుడు అనుమతులు తీసుకున్నా, అక్రమ నిర్మాణాలు చేపట్టినా వాటిని ఎలాంటి నోటీసు లేకుండ కూల్చే అధికారం నూతన పురపాలక చట్టంలో ఉంది. ఈ విషయాన్ని ప్రజల దృష్టిలో ఉంచుకోవాలి. కొత్త విధానాన్ని అమలు చేసే బాధ్యత టౌన్ ప్లానింగ్ అధికారులదే''అని తెలిపారు.
టౌన్ ప్లానింగ్ డిపార్ట్ మెంట్ లో అవినీతిపై..
కొత్త చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత అక్రమ నిర్మాణాలకు పూర్తి బాధ్యత అధికారులే వహించాల్సి ఉంటుందని మంత్రి హెచ్చరించారు. టౌన్ ప్లానింగ్ విభాగంలో అవినీతి ఆరోపణలపైనా వేగంగా, కఠినంగా వ్యవహరిస్తామన్నారు. రూల్స్ ని ఉల్లంఘిస్తే ఏ స్థాయి అధికారులనైనా ఉపేక్షించబోమన్నారు. కొత్త చట్టం ప్రకారం పురపాలక ఉద్యోగులు, పాలక మండళ్లపై నేరుగా కఠిక చర్యలు తీసుకునే వీలుంటుదని గుర్తుచేశారు. అవసరానికి తగ్గట్లు టౌన్ ప్లానింగ్ విభాగంలో ఖాళీల్ని భర్తీ చేస్తామని చెప్పారు.
అర్బనైజేషన్ పెరుగుతోంది.. బీ అలర్ట్..
మెరుగైన జీవన ప్రమాణాలు, ఉపాధి అవకాశాల కోసం ప్రజలు పట్టణాలవైపు చూస్తున్నారని, అర్బనైజేషన్ వేగంగా జరుగుతున్న నేపథ్యంలో పట్టణాలు మౌలిక వసతుల కల్పనతో పాటు, పట్టణాన్ని సమగ్ర కార్యచరణతో అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని అధికారులకు మంత్రి కేటీఆర్ గుర్తుచేశారు. అర్బనైజేషన్ సవాళ్లను ఎదుర్కొనేలా కొత్త పురపాలక చట్టం రూపొందించామన్నారు. ‘‘ప్రతి పురపాలికకు తప్పనిసరిగా మాస్టర్ ప్లాన్ ఉండాలని, రాష్ట్రంలో ఉన్న ఆరు పట్టణాభివృద్ధి సంస్థలు,హెచ్ యండిఏ విజయవంతంగా అనుసరిస్తున్న ల్యాండ్ పూలింగ్ వంటి పద్ధతులను అనుసరించాలని మంత్రి సూచించారు. ఈ సమావేశంలో పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ తో పాటు హైదరాబాద్ సిసిపి దేవేందర్ రెడ్డి, మరియు డిటిసిపి ఉన్నతాధికారులు పాల్గొన్నారు.