ప్రముఖ పాత్రికేయులు రాఘవాచారి మృతి .. జగన్,కేసీఆర్ ,పవన్ లతో పాటు పలువురు ప్రముఖుల సంతాపం
విశాలాంధ్ర పూర్వ సంపాదకులు చక్రవర్తుల రాఘవాచారి కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ తుదిశ్వాస విడిశారు. రాఘవాచారి 1972 నుంచి విశాలాంధ్ర ఎడిటర్గా బాధ్యతలు తీసుకున్నారు. విశాలాంధ్ర ఎడిటర్గా మూడు దశాబ్దాలు నిర్విఘ్నంగా కొనసాగారు. విశాలాంధ్ర పూర్వ సంపాదకులు సి.రాఘవాచారి మృతి పట్ల పలువురు ప్రముఖులు, తెలుగురాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రగాఢ సంతాపం తెలియజేశారు. ఈ రోజు సాయంత్రం ఆయన అంతిమ యాత్రను విశాలాంధ్ర కార్యాలయం నుంచి నిర్వహించనున్నట్లుగా తెలుస్తుంది .
రాఘవాచారి మరణం పాత్రికేయ ప్రపంచానికి తీరని లోటని సిపిఐ నేతలు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.ఆయన సేవలు ఎనలేనివని కొనియాడారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ప్రగాఢ సంతాపం తెలిపారు. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడిగా విద్యార్థి ఉద్యమానికి ఆయన అందించిన సేవలు ఎనలేనివని కొనియాడారు. 30 ఏళ్ల పాటు విశాలాంధ్ర సంపాదకులుగా రాఘవాచారి బాధ్యతలు నిర్వర్తించారని రామకృష్ణ తెలిపారు. సీపీఐ రాష్ట్ర కంట్రోల్ కమిషన్ చైర్మన్గా, సీపీఐ జాతీయ కంట్రోల్ కమిషన్ సభ్యులుగా ఆయన బాధ్యతలు నిర్వర్తించారు అని పేర్కొన్నారు. రాఘవాచారి మృతికి సీపీఐ నేత నారాయణ సంతాపం తెలిపారు. రాఘవాచారి కుటుంబానికి ప్రగాడ సానుభూతి తెలిపారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని నారాయణ గుర్తు చేసుకున్నారు. నిబద్దత ఉన్న జర్నలిస్ట్ అన్నారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ సైతం రాఘవాచారి మృతిపట్ల తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. సీనియర్ సంపాదకుడు, సామాజిక ఉద్యమకారుడు రాఘవాచారి మృతి పట్ల ముఖ్యమంత్రి కేసిఆర్ తీవ్ర దిగ్భ్రాంతి చెందారు. నిబద్ధత కలిగిన జర్నలిస్ట్గా, విలువలు కలిగిన సామాజిక కార్యకర్తగా ఆయన సాగించిన జీవితం ఆదర్శప్రాయం అని కేసీఆర్ పేర్కొన్నారు. రాఘవాచారి కుటుంబ సభ్యులకు కేసీఆర్ సానుభూతి తెలిపారు. రాఘవాచారి గొప్ప రచయిత, కవి, జీవితాంతం సామాజిక స్పృహతో తాడిత పీడిత వర్గ చైతన్యం కోసం కృషి చేసిన తన కలానికి పదును పెట్టిన జర్నలిస్టులలో మొదటి వరుసలో ఉండే వాడు అని కోదండరాం రాఘవాచారి సేవలను కొనియాడారు. ఆయన మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాఘవాచారి మరణం తెలుగు వారందరికీ తీరనిలోటని ప్రస్తావిస్తూ లేఖ విడుదల చేశారు. విశాలాంధ్ర రాఘవాచారి అంటే తెలియనివారుండరు అని నడిచే విజ్ఞాన ఖని గా ఆయనకు పేరుందని పేర్కొన్నారు. వరంగల్ జిల్లా మారుమూల పల్లెలో సాంప్రదాయ కుటుంబంలో జన్మించినప్పటికీ అభ్యుదయ వాదిగా తనను తాను రూపుదిద్దుకున్నారని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. అరుదైన వ్యక్తుల్లో ఆయన ఒకరన్నారు. జనసేన పార్టీ తరఫున అంజలి ఘటిస్తున్నాను అని, ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సైతం రాఘవాచారి విలువ ఆధారిత జర్నలిజాన్ని విశ్వసించారని పేర్కొన్నారు. మార్క్సిస్టు మేధావి అయిన ఆయన మృతి పట్ల ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.