ఉద్యమ సింహంపై వీహెచ్ ఫైర్..వాయిదా వేయాలని ఈసీకి కంప్లైంట్
టాలీవుడ్లో ప్రస్తుతం బయోపిక్ల సీజన్ నడుస్తోంది. సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన మహానటి ఘన విజయం సాధించగా.. ఆ తర్వాత ఎన్టీఆర్ జీవితగాథ ఇతివృత్తంగా కథానాయకుడు, మహానాయకుడు, వైఎస్ రాజశేఖర రెడ్డి జీవితం ఆధారంగా యాత్ర సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అయితే ఎన్టీఆర్ లక్ష్మీపార్వతిల పరిచయం, పెళ్లి ఆతర్వాత జరిగిన పరిణామాల ఆధారంగా దర్శకుడు రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ఎన్నో అవాంతరాల మధ్య విడుదలవుతోంది. ఇక ప్రధాని మోడీ జీవితం ఆధారంగా తెరకెక్కిన పీఎం నరేంద్రమోడీ సినిమా విషయంలోనూ ఈసీకి ఫిర్యాదులు అందాయి. ప్రస్తుతం ఆ కోవలోనే కేసీఆర్ బయోపిక్ చేరింది. ఉద్యమ సింహం సినిమా విడుదల నిలిపివేయాలంటూ ఈసీకి కంప్లైంట్ అందింది. ఎన్నికల సమయంలో రిలీజవుతున్న ఈ బయోపిక్ల కారణంగా ఎలక్షన్ కమిషన్, సెన్సార్ బోర్డులకు కొత్త తలనొప్పులు మొదలయ్యాయి.
ఉద్యమ సింహంపై వీహెచ్ ఫిర్యాదు
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, ఉద్యమ సారథి కల్వకుంట్ర చంద్రశేఖర్ రావు బయోపిక్ ఉద్యమ సింహం విడుదలపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ చిత్రం విడుదలను ఏప్రిల్ 11 వరకు నిలిపివేయాలంటూ కాంగ్రెస్ నేత వి. హనుమంతరావు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఉద్యమ సింహ చిత్రం ఓటర్లను ప్రభావితం చేసేలా ఉన్నందున విడుదల నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ సీఈసీ సునీల్ అరోరాకు వినతిపత్రం ఇచ్చారు. తెలంగాణ ఇచ్చింది సోనియా అయితే కేవలం కేసీఆర్ ఒక్కడి వల్లే రాష్ట్రం ఆవిర్భవించినట్లు సినిమాలో చూపారన్నది వీహెచ్ ఆరోపణ.
లక్ష్మీస్ ఎన్టీఆర్పై ఆది నుంచి అభ్యంతరాలు
రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంపై ఆది నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్టీఆర్ జీవిత గాథ ఆధారంగా తెరకెక్కించిన ఈ సినిమాలో ఎన్టీఆర్, లక్ష్మీపార్వతిల పరిచయం, వివాహం ఆ తర్వాత జరిగిన ఆయనపై జరిగిన కుట్రను తెరపై చూపించనున్నట్లు వర్మ ప్రకటించారు. దీంతో తెలుగుదేశం పార్టీ సినిమా విడుదలను అడ్డుకునేందుకు శతవిధాల ప్రయత్నించింది. చివరకు ఏపీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటీషన్పై విచారణ జరిపిన న్యాయస్థానం ఏపీలో లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదలపై స్టే విధించింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ మినహా మిగతా ప్రపంచమంతటా సినిమా రిలీజ్ చేయనున్నట్లు వర్మ ప్రకటించారు.
వీహెచ్ సెన్సేషన్ .. చంద్రబాబు పిలిస్తే ఏపీలో టీడీపీ కోసం ప్రచారం చేస్తారట
పీఎం నరేంద్రమోడీపై ఈసీ విచారణ
ప్రధాని నరేంద్రమోడీ జీవితగాథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం పీఎం నరేంద్రమోడీ. ఏప్రిల్ 12న రిలీజ్ కానున్న ఈ సినిమాపై కాంగ్రెస్ ఈసీకి ఫిర్యాదు చేసింది. ఎన్నికల సమయంలో ఈ సినిమా విడుదల చేయడం ఓటర్లు ప్రభావితం చేయడమే అవుతుందని ఆరోపించింది. దీనిపై స్పందించిన ఎలక్షన్ కమిషన్ సినిమాలో మోడీ పాత్ర పోషించిన వివేక్ ఒబెరాయ్ వివరణ ఇవ్వాలంటూ నోటీసులు జారీ చేసింది. దీంతో ఈసీ ముందు హాజరైన ఆయన చిత్రం విడుదల కోడ్ ఉల్లంఘన కిందకు రాదని స్పష్టం చేశారు. పీఎం నరేంద్రమోడీ సినిమా రిలీజ్ విషయంలో ఈసీ త్వరలోనే నిర్ణయం ప్రకటించే అవకాశముంది.