ఎగ్జిబిషన్ బాధితుల ఆవేదన.. సొసైటీపై ఆగ్రహం.. పరిస్థితి ఉద్రిక్తం
హైదరాబాద్ : నాంపల్లి ఎగ్జిబిషన్ అగ్నిప్రమాదం వ్యాపారులకు విషాదం మిగిల్చింది. బాధితులదీ ఒక్కొక్కరిది ఒక్కో గాథ. కళ్లెదుటే తమ స్టాళ్లు కాలి బూడిద కావడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. వస్తువులు, డబ్బులు మొత్తం మంటల్లో తగలబడిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ ఆవేదన కాస్తా ఆగ్రహంగా మారడంతో ఎగ్జిబిషన్ సొసైటీ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. తగిన న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. ఒక దశలో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు జోక్యం చేసుకున్నారు.
కళ్లెదుటే..!
నాంపల్లి ఎగ్జిబిషన్ లో బుధవారం రాత్రి జరిగిన అగ్నిప్రమాదం కారణంగా, దాదాపు 40 కోట్ల రూపాయల మేర ఆస్తినష్టం జరిగినట్లు తెలుస్తోంది. జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15 వరకు 45 రోజుల పాటు జరిగే ఈ ఎగ్జిబిషన్ లో, స్టాల్స్ పెట్టడానికి దేశం నలుమూలల నుంచి వివిధ రకాల వ్యాపారులు వస్తుంటారు. ఈ 45 రోజుల పాటు జరిగే బిజినెస్ తో కొందరు సంవత్సరానికి సరిపడా ఆదాయం సంపాదిస్తారనేది ఒక అంచనా. మరో 15 రోజుల్లో ఎగ్జిబిషన్ ముగుస్తుందనగా ఇంత పెద్ద ప్రమాదం జరగడం వ్యాపారులను నిరాశకు గురిచేసింది. ప్రతి సంవత్సరం లాభాలతో తిరిగి వెళ్లే వ్యాపారులు.. ఈసారి ఇలా జరగడంతో కన్నీరుమున్నీరవుతున్నారు.
న్యాయం చేయండి..!
ఫైర్ యాక్సిడెంట్ కారణంగా స్టాల్స్ మొత్తం కాలిపోవడమే గాకుండా, కొంత నగదు కూడా కాలి బూడిదయిందని వాపోతున్నారు నిర్వాహకులు. తమకు న్యాయం చేయాలంటూ ఎగ్జిబిషన్ సొసైటీ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. రాష్ట్రం కాని రాష్ట్రం వచ్చి సర్వం కోల్పోయినట్లుగా వాపోయారు. సొసైటీ నిర్వాహకుల నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని ఆరోపించారు. అరగంట లోగా సొసైటీ సభ్యులు తమ ముందుకు రాకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పెద్దమొత్తంలో నష్టం జరిగిందని.. తమను ఆదుకోవాలని నినాదాలు చేశారు.
ఎగ్జిబిషన్ అగ్నిప్రమాదంలో ఏం జరిగింది?.. సిలిండర్లు పేలాయా?
కనీస సౌకర్యాలు లేవు.. బాధితుల ఆగ్రహం
సొసైటీ నిర్వాహకులు కనీస సౌకర్యాలు కల్పించలేదంటూ బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగి గంటలు గడుస్తున్నా.. ఇంతవరకు అధికారులు ఎవరూ తమ దగ్గరకు రాలేదని వాపోయారు. అదలావుంటే ప్రమాదం ఎలా జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామంటున్నారు నిర్వాహకులు. సీసీ టీవీ ఫుటేజ్ పరిశీలించి ప్రమాదానికి గల కారణాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. అరగంటలోగా సొసైటీ సభ్యులు రాకుంటే ఆందోళన ఉధృతం చేస్తామనే బాధితుల హెచ్చరిక నేపథ్యంలో కొంత గడువు కావాలని కోరినట్లు తెలుస్తోంది.