అది ప్రజల డబ్బు.. నయాపైసాతో సహా అప్పులు తీర్చేస్తా.. మాల్యా సెన్సేషనల్ ట్వీట్స్
ఢిల్లీ : బ్యాంకుల నుంచి అందినకాడికి రుణాలు తీసుకుని ఎగ్గొట్టారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న కింగ్ ఫిషర్ అధినేత విజయ్ మాల్యా తాజా కామెంట్స్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. నయాపైసాతో తాను తీసుకున్న బకాయిలు చెల్లిస్తానంటూ ట్విట్టర్ వేదికగా వ్యాఖ్యానించడం ఆసక్తిగా మారింది. అదలావుంటే అప్పులు చెల్లించాలనే ఉద్దేశమే ఉంటే విదేశాలకు ఎందుకు వెళ్లినట్లనే కామెంట్లు చక్కర్లు కొడుతున్నాయి.
బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని చెల్లించకుండా విదేశాలకు పారిపోయారనే అపవాదు మూటగట్టుకున్న విజయ్ మాల్యా.. తనకు ఎగ్గొట్టాలనే ఉద్దేశం లేదని, 100 శాతం రుణాలు చెల్లిస్తానంటూ ట్వీట్ చేశారు. దయచేసి మీ బకాయిలు తీసుకోండంటూ విజ్ఞప్తి చేశారు.
నేను పారిపోలేదు..!
బ్యాంకుల నుంచి అప్పు తీసుకుని ఎగ్గొట్టానని తనపై ఆరోపణలు చేయడం తగదని వ్యాఖ్యానించాడు విజయ్ మాల్యా. రుణాలు తీసుకుని పారిపోయానంటూ ప్రచారం చేయడం సరికాదన్నారు. ఎగవేతదారుడిగా తనను క్రియేట్ చేసి మీడియా, పొలిటికల్ లీడర్లు పదేపదే ప్రస్తావించడం అంతా అబద్దమన్నారు. రుణాలు చెల్లించేందుకు సిద్ధపడి కర్ణాటక హైకోర్టులో తాను రాజీ ప్రస్తావన తీసుకొస్తే.. దాని గురించి మాట్లాడేవారే లేరని ట్వీట్ చేశారు మాల్యా.
ఎయిర్లైన్ తోనే నష్టాలు.. ప్రజల డబ్బు తిరిగిచ్చేస్తా
ఆరోపణలు వచ్చిన నాటి నుంచి స్తబ్ధుగా ఉండి ఒక్కసారిగా ట్వీట్ల వర్షం కురిపించారు విజయ్ మాల్యా. 100 శాతం అప్పులు చెల్లిస్తానంటూ ట్వీట్ చేసిన మాల్యా.. మరికొన్ని ట్వీట్లలో సంస్థకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. విమానయాన సంస్థలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో కింగ్ఫిషర్ ఎయిర్లైన్ కూడా నష్టాల బాట పయనించిందని పేర్కొన్నారు. అంతేకాదు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాల మొత్తం కూడా నష్టపోయామన్నారు. అయినా కూడా 100 శాతం రుణాలు తిరిగి చెల్లించేందుకు సిద్ధమని తెలిపారు. దయచేసి తీసుకోండంటూ ట్వీట్ చేశారు.
30 ఏళ్ల నుంచి మద్యం విక్రయాలు కొనసాగిస్తున్న తమ సంస్థ తరపున దేశ ఖజానాకు వేల కోట్ల రూపాయలు ఇచ్చినట్లు తెలిపారు విజయ్ మాల్యా. ఎయిర్ లైన్స్ నుంచి కూడా ఆయా రాష్ట్రాలకు పెద్దమొత్తాలే చెల్లించినట్లు పేర్కొన్నారు. గతంలో బాగానే నడిచిన ఎయిర్ లైన్స్.. ఇంధన ధరలు పెరగడం తదితర కారణాలతో నష్టాల బారిన పడిందన్నారు. దీంతోనే ఆర్థిక ఇబ్బందులు తలెత్తినట్లు వ్యాఖ్యానించారు. ఏదిఏమైనా తాను తీసుకున్న డబ్బు ప్రజలకు చెందినది కావడంతో తిరిగి చెల్లించేందుకు సిద్ధమని ప్రకటించారు.
అసలు కథ ఇదేనా..!
బ్యాంకుల రుణాలు ఎగ్గొట్టారనే ఆరోపణల నేపథ్యంలో 2016 సంవత్సరంలో విజయ్ మాల్యా లండన్ వెళ్లిపోయారు. మనీ లాండరింగ్ కింద కేసు నమోదవడంతో 2017లో లండన్ పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేశారు. అయితే బెయిల్ పై బయటకొచ్చిన మాల్యా.. కోర్టు ఆధీనంలోని తన ప్రాపర్టీని అప్పగిస్తే వాటిని అమ్మిపెట్టి అప్పులు తీర్చుతానని ప్రకటించారు. దర్యాప్తు సంస్థలు మాత్రం మాల్యా అభ్యర్థనను తిరస్కరించాయి. ప్రస్తుతం లండన్ లోనే ఉన్న మాల్యాను భారత్ కు అప్పగించాలనే అంశంలో వెస్ట్మినిస్టర్ కోర్టులో విచారణ జరుగుతోంది. త్వరలోనే ఈ విషయంలో కోర్టు తుదితీర్పు వచ్చే అవకాశముంది. ఇలాంటి సమయంలో బ్యాంకుల బకాయిలు చెల్లించేందుకు రెడీ అంటూ మాల్యా పెట్టిన ట్వీట్లు చర్చానీయాంశంగా మారాయి.