కేసీఆర్ పంద్రాగస్టు ప్రకటనపై రాములమ్మ ఫైర్..! ప్రజాస్వమ్యం అంటే జోకైపోయిందంటూ మండిపాటు..!!
హైదరాబాద్ : తెలంగాణ సీఎం చంద్రశేఖర్ రావు సర్కార్పై కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు విజయశాంతి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆగస్ట్ 15 నుంచి అసలు పాలన చూస్తారంటున్న చంద్రశేఖర్ రావుకు, తెలంగాణ ప్రజల బాధలు జోకుల్లా అనిపిస్తున్నాయా అని ప్రశ్నించారు. ఫేస్బుక్ వేదికగా సీఎం చంద్రశేఖర్ రావుపై ఘాటైన విమర్శలు చేశారు. ఆమె ఏమందో ఆమె మాటల్లోనే ఒక సారి చూద్దాం.. "చంద్రశేఖర్ రావు గారు చెప్పే బంగారు తెలంగాణలో కొత్తగా ప్రవేశ పెట్టబోయే మున్సిపల్ చట్టం ద్వారా అక్రమ కట్టడాలను కూలుస్తామని చెబుతున్నారు.
అసలు టీఆర్ఎస్ ప్రభుత్వం దృష్టిలో ఏది అక్రమమో.. సక్రమమో చెప్పలేని అయోమయ పరిస్థితి నెలకొంది. అక్రమ కట్టడాలను కూలుస్తామని చెబుతున్న చంద్రశేఖర్ రావు గారి ప్రభుత్వం.. ఎర్రమంజిల్ గెస్ట్ హౌస్ హెరిటేజ్ భవనం అని తెలిసినా.. దానిని కూలుస్తామనడంలో ఆంతర్యం ఏమిటి? చంద్రశేఖర్ రావు దృష్టిలో ఎర్రమంజిల్ గెస్ట్ హౌస్ కూడా అక్రమ కట్టడమేనా? కేసీఆర్ గారికి తెలంగాణ ప్రజల నుంచి వినిపించే బాధలు జోక్గా అనిపిస్తాయని ఎద్దేవా చేసారు రాములమ్మ.
అంతే కాకుడా "ప్రతిపక్షాలు చేసే నిరసనలు అంతకంటే జోక్గా కనిపిస్తాయి. చివరకు హైకోర్టు ధర్మాసనం ఇచ్చిన ఆదేశాలను కూడా జోకులా అనిపించడం విడ్డూరం. దీన్ని బట్టి చూస్తే తెలంగాణాలో ప్రజాస్వామ్యం ఏ రకంగా మంటగలుస్తోందో అర్థం అవుతుంది. అధికారంలో ఉన్నాను కాబట్టి ఏం చేసినా చెల్లుతుందని చంద్రశేఖర్ రావు గారు భావించడం దురదృష్టకరం. ఇంతకాలం దేశంలో అందరికీ ఆదర్శంగా నిలుస్తామని చెప్పిన చంద్రశేఖర్ రావు గారు ఆగస్టు 15 నుంచి అసలు పాలన మొదలవుతుందని ప్రకటించడాన్ని బట్టి ఇంతకాలం అసలు తెలంగాణాలో పాలన జరగలేదు అన్న విషయం స్పష్టంగా తెలుస్తోంది.
మూడేళ్లలో అద్భుతం జరగబోతోందని చంద్రశేఖర్ రావు గారు అంటున్నారు. మరోవైపు మూడేళ్ల తర్వాత తెలంగాణలో కూడా అద్భుతం జరగబోతోందని బీజేపీ నేతలు అంటున్నారు. ఇంతకీ ఎవరి మాట నిజమవుతుందో కాలమే సమాధానం చెబుతుంది" అంటూ కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ తనదైన శైలిలో విమర్శించారు.