కేసీఆర్.. జగన్లను ఎక్కడ ఉంచాలో తెలుసు, చంద్రబాబు సక్సెస్: విజయశాంతి ప్రశంస
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం చేస్తోన్న మోసాన్ని యావత్ దేశానికి తెలియజేయడంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సక్సెస్ అయ్యారని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, మాజీ ఎంపీ విజయశాంతి మంగళవారం అన్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు, ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి అనంతరం రాములమ్మ మాటలకు ఇప్పటికీ తేడా వచ్చింది. టీడీపీతో పొత్తు వద్దని తాను అధిష్టానంతో చెప్పానని, తమ ఓటమికి ఆ పార్టీ కూడా కారణమని ఆమె అభిప్రాయపడ్డారు. ఇప్పుడు అదే చంద్రబాబుపై ప్రశంసలు కురిపించారు.
చంద్రబాబు సక్సెస్ అయ్యారు
కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం ఏపీ ప్రజలకు చేస్తున్న మోసాన్ని తెలియజేయడంలోనూ, తెలుగువారి ఆత్మగౌరవాన్ని దేశానికి చాటి చెప్పడంలోనూ చంద్రబాబు సక్సెస్ అయ్యారని విజయశాంతి చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలన్న డిమాండ్ను కాంగ్రెస్తో పాటూ దేశంలోని ప్రధాన రాజకీయ పార్టీలు సమర్ధించడం హర్షనీయమన్నారు. ఢిల్లీ వేదికగా జరిగిన నిరసన దీక్ష ద్వారా తమ పార్టీ అధ్యక్షులు రాహుల్ గాంధీ నేతృత్వంలో కేంద్రంలో యూపీయే ప్రభుత్వం ఏర్పడితే తప్ప తెలుగు ప్రజలకు న్యాయం జరగదన్న విషయంపై స్పష్టత వచ్చిందన్నారు.
బాబు ఓటమి ఖాయమని జాతీయ సర్వేలు చెప్పాయి, ఊసరవెళ్లి సిగ్గుపడేలా: ఏపీ ప్రజలకు అమిత్ షా లేఖ
కేసీఆర్కు అదే ఎక్కువ
రాజకీయాలకు అతీతంగా ఇతర రాష్ట్రాలకు చెందిన పార్టీల నేతలు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని ముక్త కంఠంతో నినదించారని విజయశాంతి పేర్కొన్నారు. కానీ పార్లమెంటు సాక్షిగా హోదాకు మద్దతిస్తామని చెప్పిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన నేతృత్వంలోని తెరాస మాత్రం ఈ అంశంపై నామమాత్రంగానైనా ప్రకటన చేయలేదన్నారు. కేసీఆర్కు తెలుగు ప్రజల ఆకాంక్షల కంటే మోడీ ప్రాపకం మాత్రమే ముఖ్యమని మరోసారి స్పష్టమైందని ఆరోపించారు.
కేసీఆర్, జగన్లను ఎక్కడ ఉంచాలో ఏపీ ప్రజలకు తెలుసు
ఏపీకి ప్రత్యేక హోదా కోసం దేశాన్ని కదిలించే రీతిలో జరిగిన దీక్షకు మద్దతు తెలపలేని కేసీఆర్... విజయవాడకు వెళ్లి అక్కడి ప్రజల అభిమానం చూరగొందామని కలలు కంటున్నారని విజయశాంతి ఎద్దేవా చేశారు. ఇలాంటి అవకాశవాద రాజకీయం చేసే నేతలనే కాదు వారిని చేరదీసే వారినీ ఎక్కడ ఉంచాలో ఏపీ ప్రజలకు బాగా తెలుసునని కేసీఆర్.. వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి అన్నారు.