జీహెచ్ఎంసీలో కరోనా కేసుల పెరుగుదలకు కారణమేంటీ.. ఆ నిజం ఒప్పుకోండి : విజయశాంతి
జీహెచ్ఎంసీ పరిధిలో ప్రతిరోజూ కరోనా పాజిటివ్ల సంఖ్య పెరగడానికి కారణం ఏమిటి? అని లంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్ పర్సన్ విజయశాంతి ప్రశ్నించారు. 'సుమారు 50 రోజులుగా ప్రజలు నిజాయితీగా లాక్డౌన్ పాటించారు కదా..? పాజిటివ్ కేసుల పెరుగుదలకు కేవలం వైన్ షాపులే కారణమైతే వాటిని మళ్ళీ మూసివేయండి.' అని డిమాండ్ చేశారు. లేదా ఇప్పటివరకూ సరైన సంఖ్యలో పరీక్షలు చేయకుంటే ఆ నిజం ఒప్పుకోవాలన్నారు.ఈ మేరకు విజయశాంతి బుధవారం(మే 13) ట్విట్టర్ ద్వారా స్పందించారు.
'అన్ని త్యాగాలు చేసిన ప్రజలు అసలు సమస్య అర్థం కాక సతమతమవుతున్నారు. వైన్ షాపులు తెరవడమే ఈ పరిస్థితికి కారణమైతే, అనేక ఇతర రాష్ట్రాల్లో కూడా ఇదే స్థాయిలో పెరుగుదల నమోదై ఉండాలి కదా..? ముఖ్యమంత్రి దొరగారు తమ తప్పిదాలను ప్రజల అలవాటు మీదకు నెట్టే ప్రయత్నమేదో చేస్తున్నట్టు కనిపిస్తోంది.' అని విమర్శించారు.
ఇదిలా ఉంటే,రాష్ట్రంలో కరోనా టెస్టులు తక్కువగా జరుగుతున్నాయంటూ ప్రతిపక్షాలు ముందు నుంచి ఆరోపిస్తోన్న సంగతి తెలిసిందే. ప్రభుత్వం వెల్లడిస్తున్న కరోనా లెక్కలపై కూడా ప్రతిపక్షాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. కాగా,మంగళవారం (మే 12) కొత్తగా తెలంగాణలో 51 కేసులు నమోదైన సంగతి తెలిసిందే. మరో ఇద్దరూ మృత్యువాతపడ్డారు. కొత్త కేసుల్లో 37 కేసులు జీహెచ్ఎంసీ పరిధిలోనే నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకూ మొత్తం కేసుల సంఖ్య 1326కి చేరుకోగా.. ప్రస్తుతం 472 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకూ మొత్తం 32 మంది మృత్యువాతపడ్డారు.
జీహెచ్ఎంసీ పరిధిలో ప్రతిరోజూ కరోనా పాజిటివ్ల సంఖ్య పెరగడానికి కారణం ఏమిటి? సుమారు 50 రోజులుగా ప్రజలు నిజాయితీగా లాక్డౌన్ పాటించారు కదా? పాజిటివ్ల పెరుగుదలకు కేవలం వైన్ షాపులే కారణమైతే వాటిని మళ్ళీ మూసివేయండి. సరైన సంఖ్యలో పరీక్షలు ఇప్పటివరకూ చేయకుంటే ఆ నిజం ఒప్పుకోండి.
— VijayashanthiOfficial (@vijayashanthi_m) May 12, 2020