దిశ గ్యాంగ్ రేప్,హత్య ఘటనపై సీఎం కేసీఆర్ ది మొక్కుబడి ప్రకటన .. విజయశాంతి ఫైర్
జస్టిస్ ఫర్ దిశ... తెలంగాణలో సంచలనం రేపిన గ్యాంగ్ రేప్, హత్య ఉదంతంతో తెలంగాణా రాష్ట్రంలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ప్రతిపక్ష పార్టీల నాయకుల నుండి తెలంగాణా ప్రభుత్వంపై విమర్శలు వినిపిస్తున్నాయి. తెలంగాణ సీఎం కేసీఆర్ పై తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్పర్సన్ విజయశాంతి విరుచుకుపడ్డారు. దిశ గ్యాంగ్ రేప్, హత్య ఉదంతంపై దేశం మొత్తం మాట్లాడుకుంటుంటే తెలంగాణ సీఎం కేసీఆర్ కు మాట్లాడడానికి 72 గంటల సమయం పట్టిందని విజయశాంతి మండిపడ్డారు.
షాద్ నగర్ కోర్టు వద్ద ఉద్రిక్త వాతావరణం ... కస్టడీ పిటీషన్ విచారణ నేపధ్యంలో టెన్షన్
హుజూర్నగర్ ఎన్నికల ఫలితాలపై ప్రెస్ మీట్ పెట్టి వెంటనే మాట్లాడిన సీఎం కేసీఆర్, ఒక ఆడపిల్ల మరణం గురించి మాట్లాడటానికి మూడు రోజులు పడుతుందా అని ప్రశ్నించారు . మృగాళ్ల చేతిలో అత్యంత దారుణంగా హతమైన వెటర్నరీ వైద్యురాలి ఘటనపై స్పందించడానికి సీఎం కేసీఆర్ కు మూడు రోజులు పట్టిందని చెప్పిన మహిళా సంఘాలు, జాతీయ మీడియా నుండి ప్రతి ఒక్కరు తీవ్రస్థాయిలో ప్రశ్నించడంతో , ఒత్తిడి తీసుకురావటంతో మొక్కుబడిగా ఓ ప్రకటనతో సరిపెట్టారని ఆమె పేర్కొన్నారు.
ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ అంటూ ప్రకటించి చేతులు దులుపుకున్నారని విజయశాంతి మండిపడ్డారు. ఘటన జరిగిన వెంటనే స్పందించి ఉంటే విలువ ఉండేదని అన్నారు.వెటర్నరీ డాక్టర్ కుటుంబసభ్యుల పట్ల పోలీసుల అనుచిత తీరుపై స్పందించకుండానే సీఎం కేసీఆర్ తప్పించుకున్నారని పేర్కొన్నారు విజయ శాంతి . ఇక బాధ్యత లేకుండా మాట్లాడిన పోలీసులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో కేసీఆర్ చెప్పలేదని, ఫిర్యాదు అందిన వెంటనే మా పరిధి కాదు అంటూ జరిగే జాప్యంపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో వెల్లడించకుండా కేసీఆర్ వెళ్లిపోయారని ఆమె తెలిపారు. మొత్తానికి సీఎం కేసీఆర్ కేవలం ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతున్న నేపధ్యంలోనే ప్రెస్ మీట్ పెట్టి మొక్కుబడి ప్రకటన చేసి వెళ్ళారని విజయశాంతి వ్యాఖ్యానించారు.