ఓటేసిన విజయశాంతి: బీజేపీలో చేరికకు మాస్కుతో సిగ్నల్, సోషల్మీడియాలో రాహుల్ ఔట్!
హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత, ప్రముఖ సినీనటి విజయశాంతి ఆ పార్టీని వీడుతున్నట్లు గత కొంత కాలంగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. గత కొద్ది నెలలుగా ఆమె కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. అంతేగాక, సీఎం కేసీఆర్ సర్కారుపై ఆమె నేరుగా విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ పేరును ఎక్కడా ప్రస్తావించడం లేదు. బీజేపీకి సానుకూల వ్యాఖ్యలు కూడా చేశారు. ఈ క్రమంలో ఆమె ఆ పార్టీలో చేరుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
బీజేపీలోకి విజయశాంతి!: ముహూర్తం ఖరారు. సంకేతాలిచ్చిన ఫైర్బ్రాండ్
విజయశాంతితో బీజేపీ నేతల మంతనాలు
ఇటీవల పలువురు బీజేపీ సీనియర్ నేతలు కూడా విజయశాంతిని కలవడం గమనార్హం. కేంద్రమంత్రి, బీజేపీ సీనియర్ నేత కిషన్ రెడ్డి విజయశాంతిని ఆమె నివాసంలో కలుసుకున్న విషయం తెలిసిందే. అలాగే, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా విజయశాంతిపై పలుమార్లు ప్రశంసా పూర్వక వ్యాఖ్యలు చేశారు. ఆమెకు కాంగ్రెస్ పార్టీలో తగిన గుర్తింపు లభించడం లేదని అన్నారు.
ఢిల్లీ వెళ్లి బీజేపీలో చేరతారంటూ..
ఈ నేపథ్యంలో విజయశాంతి ఢిల్లీ వెళ్లి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఆ పార్టీలో చేరుతున్నట్లు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత గ్రేటర్ ఎన్నికల ప్రచారం కోసం హైదరాబాద్ వచ్చిన జేపీ నడ్డాను విజయశాంతి కలిశారని, అనంతరం కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకుంటారని ప్రచారం జరిగింది.
కాషాయ రంగు మాస్కుతో ఓటేసిన విజయశాంతి..
అయితే, ఇప్పటి వరకు అలాంటివేమీ జరగలేదు. కానీ, బీజేపీ నేతలపై వస్తున్న విమర్శలపై మాత్రం సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ వస్తున్నారు విజయశాంతి. మంగళవారం గ్రేటర్ ఎన్నికల్లో ఓటువేసేందుకు వచ్చిన ఆమె.. కాషాయం రంగు మాస్కుతో దర్శనమిచ్చారు. దీంతో రాములమ్మ తాను బీజేపీలో చేరుతున్నట్లు చెప్పకనే చెప్పారని పలువురు పేర్కొంటున్నారు.
విజయశాంతి సోషల్ మీడియా ఖాతాల్లో రాహుల్ గాంధీ ఔట్
అంతేగాక, గత కొంత కాలంగా కాంగ్రెస్ పార్టీ పేరును ఉపయోగించకుండా వ్యక్తిగతంగానే తెలంగాణ సర్కారుపై విమర్శలు చేస్తూ వస్తున్న విజయశాంతి.. తాజాగా, తన సోషల్ మీడియా ఖాతాల్లో రాహుల్ గాంధీ ఫొటోను తీసేయడం గమనార్హం. ఆ స్థానంలో తెలంగాణ అసెంబ్లీ ముందున్న గాంధీ విగ్రహం ఫొటోను ఆమె పెట్టారు. ఇక బ్యాక్గ్రౌండ్ కలర్ కాషాయ రంగును పోలివుండటం గమనార్హం.
Recommended Video