రాములమ్మ కీ రోల్: బస్సుయాత్ర బాధ్యత ఆమెకే..? పాదయాత్ర కూడా..
రాములమ్మ విజయశాంతి బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. ఆమెకు ప్రాధాన్యం ఇస్తామని చెప్పినట్టే బీజేపీ హై కమాండ్ నడుచుకుంటోంది. తెలంగాణలో బీజేపీ చేపట్టే కార్యక్రమాలను విజయశాంతికి అప్పగిస్తున్నారు. మిగతా నేతలు ఉన్నా ఆమెకు ప్రయారిటీ ఇవ్వడంతో విజయశాంతి స్థానం ఎంటో చెబుతోంది. బీజేపీ చేపట్టే బస్సుయాత్ర బాధ్యతలను రాములమ్మ విజయశాంతికి అప్పగించారు.
రాములమ్మ రాకతో తెలంగాణ బీజేపీలో కొత్త జోష్ తీసుకొచ్చింది. బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు ఆమె కీలకం అని అధిష్ఠానం కూడా భావిస్తోంది. విజయశాంతికి కీలక బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. త్వరలో బీజేపీ చేపట్టే బస్సు యాత్ర బాధ్యతలన్నీ అప్పగించాలని పార్టీ భావిస్తోందని విశ్వసనీయంగా తెలిసింది. రాష్ట్రంలో మొత్తం 33 జిల్లా కేంద్రాల్లో బీజేపీ బస్సు యాత్రను నిర్వహించనుంది. ఈ యాత్ర ద్వారా ప్రజలను బీజేపీ వైపు తిప్పడమే ధ్యేయంగా రాములమ్మ ముందుకెళతారని సమాచారం.
రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అధ్యక్షత బీజేపీ ఇప్పటికే తెలంగాణలో టీఆర్ఎస్కు బలమైన ప్రత్యర్థిగా మారింది. దుబ్బాక ఉప ఎన్నికలో గెలిచి సత్తాచాటింది. తెలంగాణకు గుండె కాయ లాంటి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అద్భుతమైన ఫలితాలను రాబట్టింది. దీంతో గులాబీ దళం గుండెల్లో గుబులు రేపింది. ఈ ఊపులో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాషాయ జెండా ఎగరేయాలని కమలదళం భావిస్తోంది.
రాష్ట్ర వ్యాప్తంగా కీలక నేతలతో పాద యాత్ర నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. దీంతో ప్రజలకు దగ్గర కావాలని పార్టీ అనుకుంటోంది. అంతకన్నా ముందు రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్ర నిర్వహించేందుకు సిద్ధమైంది. బస్సు యాత్ర బాధ్యతను రాములమ్మపైనే అధిష్ఠానం ఇచ్చినట్టు తెలుస్తోంది. కానీ దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది.