రాత్రికి రాత్రే రాష్ట్రాన్ని బంగారు తెలంగాణాగా.. సీఎం కేసీఆర్ లో మార్పు వెనుక మతలబు చెప్పిన విజయశాంతి
సీఎం కేసీఆర్ పై సీనియర్ రాజకీయ నాయకురాలు విజయశాంతి విరుచుకుపడుతున్నారు. మొన్నటికి మొన్న సీఎం కేసీఆర్ ఓటమి అయోమయంలో కేసుల భయంతో చివరికి ప్రజలను బెదిరించే స్థాయికి వ్యవహరిస్తున్నారంటూ వ్యాఖ్యలు చేసిన విజయశాంతి, తాజాగా సీఎం కేసీఆర్ లో వచ్చిన మార్పుకు కారణం చెప్పారు. రాత్రికి రాత్రి సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణాగా మార్చేయాలని చూస్తున్నట్లు కనిపిస్తోంది అంటూ సెటైర్లు వేశారు.
సీఎం కేసీఆర్ నాకంటే గొప్ప నటుడు ..వాళ్ళ శవాల మీద కూర్చుని పాలన చేస్తున్నాడు :విజయశాంతి ధ్వజం
సీఎం కేసీఆర్ తాజా నిర్ణయాలపై విజయశాంతి హాట్ కామెంట్స్
తెలంగాణ సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలపై తనదైన శైలిలో వ్యాఖ్యలు చేసిన విజయశాంతి తాజాగా హాట్ కామెంట్స్ చేశారు. సీఎం కేసీఆర్ గారు కురిపిస్తున్న వరాల జల్లు చూస్తుంటే రాత్రికి రాత్రే రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చేయాలని చూస్తున్నట్టు కనిపిస్తోందన్న విజయశాంతి ఉద్యోగాల భర్తీ, ఫిబ్రవరిలో పీఆర్సీ, ప్రమోషన్లు, బదిలీలు, సాగు చట్టాలకు సై అనడం, ఎల్ఆర్ఎస్పై వెనక్కి తగ్గడం... ఇలా గత నాలుగైదు రోజులుగా కేసీఆర్ గారు చేస్తున్న ప్రకటనల మర్మమేంటో ఎవరికీ తెలియదనుకుంటే పొరపాటు అంటూ ఆమె వ్యాఖ్యానించారు.
కేసీఆర్ తాజా నిర్ణయాల వెనుక కుట్ర కాక ప్రజా సంక్షేమం ఉంటుందా ?
ప్రస్తుతం కురిపిస్తున్న వరాల జల్లుకి అర్థం ప్రజలకు తెలుసని విజయశాంతి తనదైన శైలిలో విశ్లేషించారు.
గడచిన టీఆర్ఎస్ ఆరేళ్ళ పాలనా కాలంలో జనం గుండెలు బాదుకున్నా పట్టించుకోని సమస్యలపై ఇప్పుడు ఒకొక్కటిగా దృష్టి సారిస్తుండటం వెనుక కుట్ర కాక ప్రజా సంక్షేమం ఉందని ప్రజలు నమ్మే పరిస్థితుల్లేవు అంటూ విజయశాంతి సీఎం కేసీఆర్ ప్రస్తుతం తీసుకుంటున్న నిర్ణయాల వెనుక పెద్ద కుట్ర ఉందని స్పష్టం చేశారు. ఇదే సమయంలో దుబ్బాక, జీహెచ్ఎంసీ ఫలితాలు ప్రభుత్వ అధినేత అహంకారాన్ని కొంత దారికి తెచ్చినట్లు అనిపిస్తుంది అని కూడా విజయశాంతి వ్యాఖ్యానించారు.
వరంగల్, ఖమ్మం కార్పోరేషన్లు, రాబోయే ఉప ఎన్నికల నేపధ్యంలోనే ఇదంతా
ఇక భవిష్యత్ ఎన్నికల నేపథ్యంలోనే సీఎం కేసీఆర్ ఈ తరహా సంచలన నిర్ణయాలు తీసుకున్నారని ఆమె స్పష్టం చేశారు. ప్రస్తుతం దుబ్బాక జిహెచ్ఎంసి ఎన్నికల ఫలితాల ప్రభావంతో నెలకొన్న పరిణామాలే వరంగల్, ఖమ్మం కార్పోరేషన్లు, రాబోయే ఉపఎన్నికల్లోనూ వస్తే ఎలా అన్న ఆలోచనలోనే ఈ నిర్ణయాలు తీసుకుంటున్నట్లుగా విజయశాంతి అభిప్రాయపడ్డారు. అందుకే సీఎం గారు ఎంతో కొంత జన సంక్షేమం గురించి కనీసం ఆలోచించేలా ఉన్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు .
టీఆర్ఎస్ సర్కార్ కు ఓటమి రుచి చూపిస్తేనే పని జరుగుతుంది
తద్వారా మంత్రులకు, ఎంపీలకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలు, ఎన్నికైన ప్రజాప్రతినిధులకు విలువ, సమయం, అపాయింట్మెంట్లు ఇచ్చి ప్రజా సమస్యలపై కొంత దృష్టి పెట్టే ప్రయత్నం జరగవచ్చు అంటూ సీఎం కేసీఆర్ ప్రజా సమస్యలపై దృష్టి పెట్టడం వెనక మర్మాన్ని విజయశాంతి అందరికీ అర్థమయ్యేలా చెప్పారు. అందుకోసమైనా తదుపరి ఎన్నికల ముందువరకూ కొంతకాలం అధికారంలో ఉండే ఈ టిఆర్ఎస్ ప్రభుత్వానికి, ప్రతి సందర్భంలోను ఓటమి రుచి చూపించవలసిన బాధ్యత ఉందని తెలంగాణ సమాజం అభిప్రాయపడుతోంది అంటూ వ్యాఖ్యానించారు విజయశాంతి.
కేసీఆర్ దారిలోకి రావాలంటే ఓడించాల్సిన బాధ్యత ఉందన్న రాములమ్మ
ఓటమి రుచి చూపిస్తేనే సీఎం కేసీఆర్ దారిలోకి వస్తాడు అనే అభిప్రాయాన్ని ఆమె వ్యక్తం చేశారు. ప్రస్తుతం సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలన్నీ రానున్న ఎన్నికల నేపథ్యంలోనే అంటూ స్పష్టం చేశారు. ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలంటే సీఎం కేసీఆర్ ను ఓడించాలని విజయశాంతి తేల్చిచెప్పారు. తెలంగాణ ప్రజలు కూడా ఆ దిశగా ఆలోచిస్తున్నారని బీజేపీ నేత విజయశాంతి సీఎం కేసీఆర్ కు సెటైర్లు వేశారు.