గాంధీ భవన్ నుంచే విజయశాంతిపై కుట్ర జరుగుతోందా..? సంచలన వ్యాఖ్యలు చేసిన రాములమ్మ!!
హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ ఛైర్పర్సన్ విజయశాంతి పార్టీ మారబోతున్నారనే వ్యాఖ్యలు ఇటీవల జోరందుకున్నాయి. ఆ మధ్య టీఆర్ఎస్ పార్టీలో కొనసాగి సీఎం కేసీఆర్కు సన్నిహితురాలిగా మెదిలిన విజయశాంతి తదనంతర పరిణామాలతో కారు దిగేశారు. ఆ క్రమంలో కాంగ్రెస్ గూటికి చేరి హస్తం కండువా కప్పుకున్నారు.
అయితే ఇటీవల ఆమె మళ్లీ పార్టీ మారబోతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. దాంతో అలాంటి ప్రచారం దుష్ప్రచారమని కొట్టిపారేశారు విజయశాంతి. ఈ నేపథ్యంలో ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. పార్టీ మారే ఆలోచన తనకు లేదని స్పష్టం చేశారు.
ఆరోగ్యశ్రీకి బ్రేక్.. 3రోజులుగా నిలిచిపోయిన సేవలు.. రోగుల అవస్థలు..!
విజయశాంతి పార్టీ మారబోతున్నారనే ప్రచారంపై ఆమె స్పందించారు. ఆ మేరకు ఆదివారం నాడు మీడియాకు ఓ ప్రకటన లేఖ విడుదల చేశారు. తాను పార్టీ మారబోతున్నానంటూ కొందరు కావాలనే కుట్రపూరితంగా ప్రచారం చేస్తున్నారని ఆమె ధ్వజమెత్తారు. అది కూడా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయం గాంధీ భవన్ నుంచే కుట్ర ప్రారంభమైందని హాట్ కామెంట్స్ చేశారు. అయితే ఈ విషయంపై టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డితో చర్చించినట్లు ఆమె ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
పార్టీ మార్పుపై హడావుడిగా తాను నిర్ణయం తీసుకోబోనంటూ స్పష్టం చేశారు విజయశాంతి. అదే విషయం సూటిగా, స్పష్టంగా ఉత్తమ్ కుమార్ రెడ్డికి వివరించినట్లు తెలిపారు. ఇప్పటివరకు పార్టీ మారే విషయంలో ఎలాంటి ఆలోచన లేదన్న విజయశాంతి.. అలాంటిది ఏమైనా ఉంటే తప్పకుండా బహిరంగంగానే ప్రకటిస్తానంటూ చెప్పుకొచ్చారు.