గ్రేటర్ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ దొరగారి మాస్టర్ ప్లాన్ ఇదే .. విజయశాంతి షాకింగ్ కామెంట్స్
జిహెచ్ఎంసి ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. అధికార ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల తూటాలు, వివాదాస్పద వ్యాఖ్యలు ఉద్రిక్త పరిస్థితులకు కారణమవుతున్నాయి. నిన్నటికి నిన్న తెలంగాణ రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే సహించేది లేదని తేల్చి చెప్పారు. సర్జికల్ స్ట్రైక్ వ్యాఖ్యలను పరిశీలిస్తున్నామని పేర్కొన్న డిజిపి రాష్ట్రంలో మత విద్వేషాలు రగిల్చేందుకు కుట్ర జరుగుతోంది అంటూ తమకు సమాచారం ఉందని పేర్కొన్నారు. ఇక దీని పై విజయశాంతి స్పందించారు.
గ్రేటర్ వార్: అక్బరుద్దీన్ వ్యాఖ్యలు ఎర్రగడ్డ స్థల ప్రభావం..స్పందించాల్సిన అవసరం లేదన్న విజయశాంతి
ప్రతిపక్షాల దూకుడు తట్టుకోలేక ఎంఐఎంతో కలిసి కేసీఆర్ కుట్రలు
ఇదంతా సీఎం కేసీఆర్ గారి కుట్ర అంటూ సంచలన ఆరోపణలు చేశారు విజయశాంతి.
సోషల్ మీడియా వేదికగా తాజా రాజకీయ పరిణామాల పై స్పందించిన విజయశాంతి జీహెచ్ఎంసీ ఎన్నికలలో ప్రతిపక్షాల దూకుడును తట్టుకోలేక బెంబేలెత్తిపోతున్న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు ఎంఐఎం పార్టీ తో కలిసి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రత్యర్థి పార్టీలకు చెందిన అభ్యర్థులను చివరిక్షణంలో పోటీ నుంచి తప్పించేందుకు కుయుక్తులను పన్నుతున్నారు అన్న అనుమానాలు బలపడుతున్నాయి అంటూ ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు.
పోలీసు బలగాల ప్రయోగం అందుకే
ప్రత్యర్ధి పార్టీ అభ్యర్థులను శాంతి భద్రతల పేరుతో బరిలో నుంచి తప్పించడానికి గులాబీ బాస్ కొత్త ఎత్తుగడ వేస్తున్నారని ఆమె విమర్శనాస్త్రాలు సంధించారు.
ఎంఐఎం నేతలు మతవిద్వేషాలు రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తే, దానిని కట్టడి చేయకపోగా ఎంఐఎం దౌర్జన్యాన్ని నిలదీసిన పార్టీలను నియంత్రించే విధంగా పోలీసు బలగాలను ప్రయోగించడానికి సీఎం కేసీఆర్ మాస్టర్ ప్లాన్ వేశారని వార్తలు వస్తున్నాయంటూ విజయశాంతి సంచలన ఆరోపణలు చేశారు.
ప్రత్యర్ధి పార్టీ అభ్యర్థులను శాంతి భద్రతల పేరుతో బరిలో నుంచి తప్పించే ప్లాన్
ఇంతకాలం ఎన్నికల్లో పోటీ చేసే ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులను హైజాక్ చేయడం లేదా ఎన్నికలు పూర్తయిన తర్వాత వారిని ప్రలోభపెట్టి గెలిచిన ప్రతిపక్ష పార్టీ నేతలను ఫిరాయింపులకు ప్రోత్సహించడం సీఎం కేసీఆర్ కు అలవాటుగా మారిందన్నారు.
జీహెచ్ఎంసీ ఎన్నికలలో ఈసారి ఇలాంటి రాజకీయాలు ఫలించవని సీఎం కేసీఆర్ ఒక నిర్ణయానికి రావడంతో ఇప్పుడు ఏకంగా బలమైన ప్రత్యర్థి పార్టీ అభ్యర్థులను బరిలో నుంచి తప్పించే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. శాంతి భద్రతల పేరుతో పోటీ నుండి పక్కకు తప్పించాలని కొత్త పన్నాగం పన్నారని ఆమె ఆరోపించారు.
పోలీసు యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తే తెలంగాణ సమాజం క్షమించదు
సీఎం కేసీఆర్ ఈ కుట్రలకు పోలీసు యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తే తెలంగాణ సమాజం క్షమించదు అంటూ పేర్కొన్నారు విజయశాంతి . రాష్ట్రంలో తాజాగా శాంతిభద్రతల విషయంలో పోలీసు ఉన్నతాధికారుల నుండి వస్తున్న కొత్త వాదనకు సీఎం కేసీఆర్ కారణమని కొత్త వాదన వినిపించారు విజయశాంతి. జిహెచ్ఎంసి ఎన్నికల నేపథ్యంలో విజయశాంతి తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలు సీఎం కేసీఆర్ ప్రతిపక్ష పార్టీల నేతలపై కేసులు పెట్టేందుకు పోలీసు ఉన్నతాధికారులను రంగంలోకి దించిన అనుమానాలకు ఊతం ఇచ్చేలా ఉన్నాయి.