స్వామీజీకే శఠగోపం.. కారు మాయం.. డ్రైవర్ నిర్వాకంతో రోడ్డుపై ఒంటరిగా..!
హైదరాబాద్ : ఆ కారు డ్రైవర్ బుద్ధి చెడిందో, మరింకేమైనా జరిగిందో తెలియదు గానీ ఓ స్వామిజీకి శఠగోపం పెట్టాడు. ఆయన కారు తీసుకుని పరారయ్యాడు. డ్రైవర్ చేసిన పనికి ఆ స్వామిజీ కాసేపు నొచ్చుకుని.. చివరకు ఏం చేయాలో తెలియక పోలీసులను ఆశ్రయించారు.
విశ్వనాథ పీఠాధిపతికి చెందిన విశ్వనాథ స్వామిజీకి చేదు అనుభవం ఎదురైంది. చాలాకాలంగా తన దగ్గర నమ్మకంగా పనిచేస్తున్న డ్రైవర్ అకస్మాత్తుగా ప్లేటు ఫిరాయించాడు. సోమవారం నాడు ఉదయం శామీర్ పేట మీదుగా వెళుతున్న స్వామిజీ.. మూత్ర విసర్జన కోసం డ్రైవర్ను కారు ఆపమన్నారు. అయితే ఆ డ్రైవర్ కారుతో ఉడాయించడం చర్చానీయాంశమైంది.
ఇక తిరుగుడు బందే.. మ్యారేజ్ రిజిస్ట్రేషన్ సులభతరం.. సర్టిఫికెట్ ఎక్కడ తీసుకోవాలంటే..!
డ్రైవర్ చేసిన పనికి స్వామిజీ ఆశ్చర్యపోయారు. చివరకు శామీర్ పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని రంగంలోకి దిగిన పోలీసులు టెక్నాలజీని వాడారు. జీపీఆర్ఎస్ సాయంతో ఆ కారును ట్రాక్ చేశారు. పటాన్ చెరు ప్రాంతంలో ఉన్నట్లు గుర్తించి ఛేజ్ చేశారు. అయితే పోలీసులు తనను వెంబడిస్తున్నారనే విషయం గ్రహించి ఆ డ్రైవర్ కారును వదిలేసి పారిపోయాడు.
కారులో ఉన్న 40 వేల రూపాయల నగదుతో పాటు స్వామిజీకి చెందిన పలు ఏటీఎం కార్డులను ఎత్తుకెళ్లాడు డ్రైవర్. అయితే ఆ కారును స్వాధీనం చేసుకున్న పోలీసులు స్వామిజీకి అప్పగించడంతో కథ సుఖాంతమైంది. మరోవైపు నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. కేవలం డబ్బుల కోసమే డ్రైవర్ ఈ పని చేసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.