ఓటేసిన ప్రముఖులు: చిరంజీవి, సీపీలు సజ్జనార్, అంజనీ, మహేశ్ భగవత్
గ్రేటర్ పోలింగ్ కొనసాగుతోంది. ఆమూల్యమైన తమ ఓటుహక్కును వయోజనులు వినియోగించుకుంటున్నారు. ప్రముఖులు కూడా ఉదయాన్నే ఓటు వేస్తున్నారు. సినీ తారలు, రాజకీయ నేతలు, పోలీసు ఉన్నతాధికారులు తమ ఓటు వేశారు. చలిని సైతం లెక్కచేయకుండా వారు పోలింగ్ కేంద్రాలకు వస్తున్నారు. వయోజనులు కూడా భారీగా బారులుతీరారు. మిగతావారు కూడా ఓటు వేయడానికి రావాలని కోరుతున్నారు.
ఓటేసిన సీపీలు..
అంబర్ పేట మున్సిపల్ గ్రౌండ్ ఇండోర్ స్టేడియంలో హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ అంజన్ కుమార్ కుటుంబ సమేతంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఓటు హక్కు వినియోగించుకోవాలని అంజన్ కుమార్ విజ్ఞప్తి చేశారు. ఇటు రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ కుందన్ బాగ్లో ఓటు వేశారు. సైబరాబాద్ సీపీ సజ్జనార్ నాంపల్లిలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.
పీస్పుల్..
ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరుగుతున్నాయని రాచకొండ సీపీ మహేష్ భగవత్ పేర్కొన్నారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. పోలింగ్ కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తుతో పాటు సీసీ కెమెరాల ద్వారా నిఘా పటిష్టం చేశామన్నారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. సమస్యాత్మక ప్రాంతాలపై గట్టి నిఘా పెట్టామని మహేష్ భగవత్ వెల్లడించారు.
సతీసమేతంగా చిరంజీవి
జూబ్లీహిల్స్ క్లబ్లో సతీమణి సురేఖతో కలిసి చిరంజీవి ఓటు వేశారు. ఓటు వేసేందుకు ఉదయమే జూబ్లీహిల్స్ క్లబ్కు వారు చేరుకున్నారు. ఫిల్మ్ నగర్ క్లబ్ లో పరుచారి గోపాల కృష్ణ, నిర్మాత శ్యామ్ కుమార్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మిగతా సెలబ్రిటీలు కూడా ఓటు వేసేందుకు ఒక్కొక్కరు క్రమంగా వస్తున్నారు.
Recommended Video
డబ్బుల పంపిణీ
రాజేంద్రనగర్ సర్కిల్ పరిధి మైలార్దేవుపల్లి, రాజేంద్రనగర్, అత్తాపూర్ డివిజన్ పరిధిలో టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులు సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు తమకు అనుకూలంగా లేని ప్రాంతాల్లో డబ్బులు పంపిణీ చేసినట్లు తెలిసింది. పోలీసులు రావడంతో మెల్లగా జారుకున్నారు.