ఓటర్లకు మొబైల్ తిప్పలు.. ముందస్తు ప్రచారం చేయని ఈసీ
హైదరాబాద్ : ఎన్నికల వేళ ఓటర్లు ఇబ్బందులపాలవుతున్నారు. పోలింగ్ కేంద్రాలకు మొబైల్ ఫోన్లు తీసుకెళుతున్న ఓటర్లను పోలీసులు అడ్డుకుంటున్నారు. పోలింగ్ కేంద్రాల్లోకి ఫోన్లు అనుమతి లేదంటూ ఆబ్జెక్షన్ చెబుతుండటంతో ఓటర్లు నిరాశ చెందుతున్నారు. తమ మొబైల్స్ ఎక్కడ పెట్టుకోవాలంటూ వాపోతున్నారు.
గత ఎన్నికల సమయంలో కొందరు ఓటర్లు ఓటు వేసేటప్పుడు సెల్ఫీలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో ఈసారి పోలింగ్ కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్లు అనుమతించేది లేదంటోంది ఎన్నికల సంఘం. అదలావుంటే మొబైల్ ఫోన్ల అనుమతికి సంబంధించి ఎలాంటి ముందస్తు ప్రకటన గానీ, ప్రచారం గానీ చేయకుండా ఎన్నికల సంఘం ఇలా చేయడం సరికాదంటున్నారు ఓటర్లు.
సాధారణంగా పరీక్షల సమయంలో మొబైల్ ఫోన్లు తదితర అనుమతించని వస్తువులను పరీక్షా కేంద్రం ఆవరణలో భద్రపరుచుకునేందుకు అవకాశం కల్పిస్తారు. అలాంటిది పోలింగ్ కేంద్రాల్లో మొబైల్ ఫోన్లు భద్రపరుచుకోవడానికి ఎలాంటి సౌకర్యం కల్పించకపోవడం గమనార్హం.