ఓట్లు వేస్తూ సెల్ఫీలు.. కేసుల పాలవుతున్న యువకులు.. ఇదేమి పెంటరా నాయనా..!
హైదరాబాద్ : సెల్ఫీల పిచ్చి పీక్ స్టేజీకి చేరింది. చేతిలో సెల్లుందని లెక్కలేనన్ని సొల్లు ఫోటోలు తీస్తున్నారు. సమయం, సందర్భం జాన్తా నై.. క్లిక్మనిపించడం ఒకటే తెలుసు. అయితే ఆ హ్యాబిట్ కొన్ని సందర్భాల్లో కొంప ముంచుతోంది. ఇష్టానుసారంగా ఫోటోలు తీస్తూ కష్టాల పాలవుతున్నారు. అదలావుంటే ఎన్నికల వేళ నిబంధనలు కఠినతరంగా ఉంటాయని తెలిసి కూడా కొందరు లైట్ తీసుకుంటున్నారు. పోలింగ్ కేంద్రాల్లో ఓటు వేస్తూ.. సెల్ఫీలు తీసుకుని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఓటు వేసేటప్పుడు ఫోటోలు, వీడియోలు తీయడం చట్టరీత్యా నేరం. అయినా కూడా కొందరు ఏమవుతుందిలే అనుకుంటూ స్మార్ట్ఫోన్లతో క్లిక్మనిపిస్తున్నారు. దాంతో పోలీస్ కేసులు నమోదవుతుండటం చర్చానీయాంశమైంది.
ముదురుతున్న సెల్ఫీ పిచ్చి.. ఓట్లు వేస్తూ ఫోటోలు
ఎన్నికల సందర్భంగా పోలింగ్ కేంద్రాల దగ్గర ఆంక్షలు ఉంటాయి. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు పోలీసులు అప్రమత్తంగా ఉంటారు. అయితే కొంతమంది యువకులు తెలిసి తెలియక చేసిన తప్పులతో పోలీస్ స్టేషన్ మెట్లెక్కుతున్నారు. ఓటు వేసేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఫోటోలు, వీడియోలు తీయరాదనే నిబంధనను బేఖాతరు చేస్తున్నారు. ఆ క్రమంలో పరిషత్ ఎన్నికల వేళ సోమవారం నాడు (06.05.2019) మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లాకు చెందిన సంతోష్ అనే యువకుడు అడ్డంగా బుక్కయ్యాడు.
ఘనాపూర్ లోని ఓ పోలింగ్ బూత్ లో ఓటేస్తూ సెల్ఫీ తీసుకున్నాడు. అయితే అతడు బయటకొచ్చే క్రమంలో పోలీసులకు అనుమానం వచ్చి ఫోన్ చెక్ చేశారు. అతడు ఓటు వేసిన ఫోటో అందులో కనిపించడంతో అదుపులోకి తీసుకుని ఘట్ కేసర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా అలాంటి ఘటన జరిగింది. బూర్గం పహాడ్ జడ్పీటీసీ ఎన్నికల్లో ఓ యువకుడు తాను ఎవరికి ఓటు వేస్తున్నాడో తెలిసేలా వీడియో తీశాడు. ఒక పార్టీ గుర్తుపై ఓటు వేస్తున్నట్లుగా ఉన్న ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే ఆ యువకుడిపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారోననే చర్చ నడుస్తోంది.
సైకో శీనుగాడిని కస్టడీలోకి తీసుకోవడమే కాదు.. వాన్ని కాపాడటం పోలీసులకు సవాలే..!
నిబంధనలకు విరుద్ధం.. అయినా కూడా..!
పోలింగ్ కేంద్రాల్లోకి సెల్ ఫోన్లు అనుమతించేది లేదని ఎన్నికల సంఘం చెప్పినా.. ఓటు వేసేటప్పుడు గోప్యత పాటించాలని అధికారులు మొత్తుకుంటున్నా.. కొందరి తీరు మాత్రం మారడం లేదు. అత్యుత్సాహం ప్రదర్శిస్తూ లేనిపోని చిక్కుల్లో పడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా హైదరాబాద్ రాజేంద్ర నగర్ ప్రాంతంలోని ఉప్పరపల్లికి చెందిన శివశంకర్ ఓటేస్తూ ఫోటో దిగి అడ్డంగా బుక్కయ్యాడు. ప్రిసైడింగ్ ఆఫీసర్ గుర్తించడంతో అతడి గుట్టురట్టైంది. ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని సెక్షన్ 188 ( ప్రభుత్వ అధికారుల నిబంధలను ఉల్లఘించడం) కింద కేసు నమోదు చేశారు.
ఫోటోలు దిగుతూ పోస్టింగులు, షేరింగులు
సెల్ఫీ పిచ్చితో లోక్సభ ఎన్నికల వేళ అధికార పార్టీ లీడర్ వెంకటేశ్ కటకటాల పాలు కావడం చర్చానీయాంశమైంది. మల్కాజ్ గిరి లోక్సభ సెగ్మెంట్ లోని టీఆర్ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డికి పోలింగ్ ఏజెంట్ గా వ్యవహరించిన సదరు నేత అడ్డంగా బుక్కయ్యాడు. పోలింగ్ ముగిసిన తర్వాత ఈవీఎంలు, వీవీ ప్యాట్ యంత్రాలను హోలి మేరీ కాలేజీలోని స్ట్రాంగ్ రూమ్ కు తరలించారు. అయితే ఈవీఎంలను భద్రపరిచిన తర్వాత అక్కడ వెంకటేశ్ సరాదాగా సెల్ఫీ దిగడంతో పాటు వీడియో తీశాడు. అవి కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వెంకటేశ్ ఎన్నికల సంఘం నిబంధనలను ఉల్లంఘించాడని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇలాంటి ఘటనలు ఎన్నో జరుగుతున్నా.. యువతలో మాత్రం సెల్ఫీల పిచ్చి తగ్గడం లేదు. దోస్తుల దగ్గర ఏదో బిల్డప్ ఇద్దామని ఇలా ఫోటోలు దిగుతూ చివరకు ఊచలు లెక్కించాల్సి వస్తోంది.