హైదరాబాద్లో అనుకోని అతిథి.. అరుదైన రాబందు కూన
హైదరాబాద్ : భాగ్యనగరంలో అనుకోని అతిథి దర్శనమిచ్చింది. అరుదైన రాబందు కూన కనిపించింది. గత 20 ఏళ్లలో ఏనాడూ కనిపించని రాబందు కూన ఇప్పుడు ప్రత్యక్షం కావడం చర్చానీయాంశమైంది. అంతరించిపోతున్న పక్షుల జాబితాకు చెందిన రాబందు కూనను చూసి నగరవాసులు ఆశ్చర్యానికి గురయ్యారు.
స్థానిక యువకులు రక్షించి..!
మాసబ్ ట్యాంక్ ఏరియాలోని ఆసిఫ్ నగర్లో అరుదైన రాబందు పక్షి కనిపించింది. కొన్నాళ్లుగా నగరంలో ఎప్పుడూ కనిపించకపోవడంతో దాని గురించి తెలియని స్థానికులు వింతగా చూశారు. శుక్రవారం (19.05.2019) నాడు రాత్రి 9 గంటల సమయంలో ఇద్దరు యువకులు మొదటగా దాన్ని గుర్తించారు. అప్పటికే అది చాలా నీరసించిపోయి ఉంది. దాంతో వెంటనే ఆ యువకులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.
హాజీపూర్ ఉదంతంపై సీఎం కేసీఆర్ బాధపడ్డారు.. సైకో శీనుగాడికి కఠిన శిక్ష ..! కేటీఆర్ హామీ
జూ పార్కుకు తరలింపు
విషయం తెలియగానే అధికారులు ఆసిఫ్ నగర్కు చేరుకున్నారు. దాన్ని నిశితంగా పరిశీలించి.. అంతరించిపోతున్న పక్షుల జాబితాకు చెందిన అరుదైన తెల్ల గూని రాబందు కూనగా గుర్తించారు. ఎండ వేడిమి కారణంతో బాగా నీరసించిపోవడంతో.. కాసింత ఎలక్ట్రోల్ పౌడర్ తాగించడంతో కోలుకుంది. అనంతరం సంరక్షణ కోసం నెహ్రూ జులాజికల్ పార్క్ వైద్యశాలకు తరలించారు.
చాలాకాలం తర్వాత హైదరాబాద్లో అరుదైన జాతికి చెందిన రాబందు కనిపించడంతో.. వాటి మూలాలు ఏమైనా ఉన్నాయోమోనని అధికారులు భావిస్తున్నారు. ఆసిఫ్ నగర్ ప్రాంతంలో రాబందు కూన కనిపించడంతో.. దానికి సంబంధించిన గూడు అక్కడెక్కడో ఉండొచ్చని వెతికే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిసింది.
1999లో హయత్ నగర్లో కనిపించిన రాబందు
ప్రపంచవ్యాప్తంగా అంతరించే దశలో ఉన్న ఈ అరుదైన జాతి రాబందు అప్పుడెప్పుడో 20 ఏళ్ల కిందట కనిపించింది. 1999లో హయత్ నగర్ ప్రాంతంలోని హరిణ వనస్థలి పార్క్ సమీపంలో కనిపించినట్లుగా తెలుస్తోంది. దాని తర్వాత భాగ్యనగరంలో రాబందు కనిపించడం ఇదే తొలిసారి. అయితే రాబందులు తెలంగాణలో ఎక్కడా కనిపించవు గానీ.. కాగజ్ నగర్ ప్రాంతంలో మాత్రమే కనిపిస్తాయనే వాదనలు వినిపిస్తున్నాయి.