మూడు రోజుల మణిక్కం టూర్ విజయవంతమైందా..?టీ కాంగ్రెస్ లో వ్యక్తమవుతున్న బిన్నాభిప్రాయాలు.!
హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కొత్త వ్యవహారాల ఇంఛార్జ్ మణిక్కం ఠాగూర్ కొత్త జోష్ నింపారా..? నేతలు మధ్య ఉత్సాహ వాతావరణాన్ని తీసుకురాగలిగారా..?సీనియర్లకు జూనియర్లకు మధ్య నెలకొన్న వివాదాలను పరిష్కరించి పార్టీలో ఐక్యతా రాగం పాడించగలిగారా..? మూడు రోజుల తెలంగాణ పర్యటనలో నూతన వ్యవహారాల ఇంఛార్జ్ మణిక్కం ఠాగూర్ తెలుసుకున్న వాస్తవాలేంటి. పార్టీ బలోపేతానికి, రానున్న రాజకీయ సవాళ్లను అధిగమించడానికి అనుసరించాల్సి వ్యూహంపై స్పష్టతను సాధించగలిగారా.? పార్టీ సంస్ధాగత బలోపేతానికి తాను తీసుకోబోయే చర్యల గురించి అధిష్టానానికి ఎలాంటి నివేదిక ఇవ్వనున్నారు. అసలు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు ఠాగూర్ టూర్ పట్ల ఎలా స్పందింస్తున్నారు.?
ప్రక్షాళణ దిశగా కాంగ్రెస్ పార్టీ.. తెలంగాణలో విజయవంతమైన మణిక్కం ఠాగూర్ తొలి పర్యటన..
దేశానికి స్వతంత్య్రాన్ని, ప్రజల మనోభావాలకనుగుణంగా తెలంగాణ రాష్టాన్ని ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ మాత్రమే నని పలు సందర్బాల్లో ఆ పార్టీ నేతలు స్పష్టం చేస్తుంటారు. ప్రస్తుతం దేశంతో పాటు మరికొన్ని రాష్ట్రాలే కాకుండా తెలంగాణలో కాంగ్రెస్ పరిస్ధతి దారుణంగా తయారయ్యింది. పార్టీ శ్రేణులు లేక కొన్ని చోట్ల, నాయకత్వం లేక కొన్ని చోట్ల, వివాదాలతో మరికొన్ని చోట్ల తీవ్ర కష్టాలు చవిచూస్తోంది కాంగ్రెస్ పార్టీ. వరుసగా 2014-19లో దేశ వ్యాప్తంగా ఘోర పరాజాయాన్ని చవిచూసిన కాంగ్రెస్ పార్టీకి వచ్చే సార్వత్రిక ఎన్నికలు సవాల్ గా పరిణమించాయి. అందుకోసం అన్ని రాష్ట్రాల్లో ప్రక్షాళన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది కాంగ్రెస్ అధిష్టానం.
వచ్చే ఎన్నికలు కాంగ్రెస్ కు ఎంతో ప్రతిష్టాత్మకం.. ముందస్తు ప్రణాళికలు రచిస్తున్న టీ కాంగ్రెస్..
అందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి, స్థానిక పార్టీకి సంధాన కర్తలుగా వ్యవహరించే వ్యవస్ధను పటిష్టం చేయాలని భావించిన ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆదిశగా కార్యచరణ రూపొందించినట్టు తెలుస్తోంది. అందులో భాగంగా కొన్ని రాష్ట్రాలను ప్రతిష్టాత్మకంగా భావించిన సోనియా ఆయా రాష్ట్రాల్లో సమూల మార్పులకు పావులు కదుపుతోంది. తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ పైన తెలంగాణ ప్రజలకు కాస్తో కూస్తో ఉన్న సానుభూతిని మరింత లోతుగా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైందని భావించిన అధిష్టానం ఈ సారి అలాంటి పొరపాటు పునరావృతం కాకుండా జాగ్రత్తపడాలని కృతనిశ్చయంతో ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే తెలంగాణ రాష్ట్రానికి మణిక్కం ఠాగూర్ అనే కొత్త వ్యవహారాల ఇంఛార్జ్ ని నియమించి ఫలితం రాబట్టాలని కాంగ్రెస్ భావిస్తోంది.
తెలంగాణ నేతల్లో జోష్ నింపిన మణిక్కం ఠాగూర్.. అది చాలదంటున్న ఇతర నాయకులు..
నూతన తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మణిక్కం ఠాగూర్ పదవి తీసుకున్న వారం రోజులల్లోనే తెలంగాణలో మూడు రోజులు పర్యటించేందుకు కార్యాచరణ రూపొందించుకున్నారు. పార్టీలోని అన్ని స్ధాయిల నేతలతో సమావేశాలు నిర్వహించి పార్టీ బలోపేతానికి ప్రణాళిక రూపొందించారు ఠాగూర్. నేతలతో సభలు సమావేశాలు నిర్వహిస్తూనే కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసించే క్రమంలో అరెస్టు కూడా అయ్యారు. గోషామహల్ పోలీసు స్టేషన్లో రెండు గంటలు గడిపిన మణిక్కం ఠాగూర్ కు మంచి గుర్తింపు వచ్చిందనే చర్చ జరుగుతోంది. పార్టీ బలొపేతం కోసమే కాకుండా రానున్న రోజుల్లో పార్టీని విజయతీరాలకు చేర్చడానికి తనలో ఉన్న దృఢ సంకల్పం చెప్పకనే చెప్పినట్టైందనే చర్చ జరుగుతోంది. కాగా మణిక్కం ఠాగూర్ నిర్వహించిన సమావేశాల పట్ల సానుకూల స్పందన వ్యక్తం అయినప్పటికి కొంత మంది తెలంగాణ కాంగ్రెస్ నేతలు బిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
గాంధీ భవన్ సమావేశాల వల్ల అంత ఉపయోగం ఉండదు.. క్షేత్ర స్ధాయిలో పర్యటిస్తే ఫలితం వేరంటున్న నాయకులు..
నూతన వ్యవహారాల ఇంఛార్జ్ గా అనేక సమావేశాలు నిర్వహించినప్పటికి క్షేత్ర స్దాయిలో సామాన్య ప్రజానికం నాడీ దొరకబుచ్చుకోవాలని, జిల్లా స్దాయిలో కాంగ్రెస్ నాయకుల మనోభావాలను ప్రత్యక్షంగా తెలుసుకున్నప్పుడే పార్టీ గాడిలో పడుతుందని, అంతే కాకుండా గాంధీ భవన్ లో జరిపిన సమావేశాల ద్వారా నాయకుల్లో, కార్యకర్తల్లో, ఉత్సాహం వస్తుంది తప్ప గ్రామ స్దాయిలో పార్టీ బలోపేతం కావడం కష్టమనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మణిక్కం ఠాగూర్ తన రెండవ పర్యటనలో తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పర్యటించి వాస్తవ పరిస్థితులమీద దృష్టి కేంద్రీకరిస్తే పార్టీ తప్పకుండా విజయ తీరాలకు చేరుతుందనే అభిప్రాయాలను కొంత మంది నేతలు వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి మూడు రోజుల నూతన వ్యవహారాల ఇంఛార్జ్ మణిక్కం ఠాగూర్ తెలంగాణ పర్యటన విజయవంతం అయినప్పటికి అనుకున్న లక్ష్యాన్ని ఛేదించడానికి మాత్రం మరో వ్యూహం అవసరమనే అభిప్రాయాలు టీపిసిసి నేతల్లో వ్యక్తం అవుతున్నాయి.