విశ్వ నగరంలో నీటి కష్టాలు..! అడుగంటిన బోర్లు..! 1980 పరిస్థితులు రిపీట్...!!
Recommended Video
హైదరాబాద్ : నగర ప్రజలు దాహార్తితో అలమటిస్తున్నారు. వాటర్ బోర్డ్ సరఫరా చేసే నీరు, ఇళ్లలోని బోర్లతో ఇన్నాళ్లు గొంతు తడుపుకున్న గ్రేటర్ వాసులు వేసవిలో నీటి కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితి. భూగర్భజలాలు అడుగంటడంతో ఇళ్లలోని బోర్లన్నీ ఎండిపోయాయి. దీంతో వాటర్బోర్డ్ సరఫరా చేసే నీటిపైనే ఆధారపడుతున్నారు. సుమారు కోటి జనాభా ఉన్న మహానగరానికి వాటర్ బోర్డ్ సరఫరా చేసే నీరు ఏ మాత్రం సరిపోవడం లేదు. రోజు విడిచి రోజు నీటిని సరఫరా చేస్తున్నా, సరిపడా నీరు రాక ఇబ్బందులు పడుతున్నారు. లోప్రెషర్ సమస్య తీవ్రంగా వేధిస్తోంది. నగరంలోని పలు బస్తీలు, కాలనీలకు రోజుల తరబడి నీళ్లు రావడం లేదు. ఎగువ ప్రాంతాలకు నీటి సరఫరా పూర్తిగా బందైంది. పలు కాలనీలకు, బస్తీలకు వాటర్ ట్యాంకర్లే దిక్కయ్యాయి. రోజురోజుకూ ఎండలు తీవ్రమవుతున్న నేపథ్యంలో నగరంలో నీటి కష్టాలను తెలుసుకునేందుకునే ప్రయత్నం చేద్దాం..!
గ్రేటర్లో తాగునీటి పాట్లు... ఎండిన బోర్లు...!నీరు కొనాల్సిన పరిస్థితులు..!!
చంపాపేట డివిజన్లోని కటికోనికుంట, మాధవనగర్కాలనీ, మారుతీనగర్ కాలనీలలో తరచూ లోప్రెషర్తో నీరు వస్తోంది. కొన్ని చోట్ల ఉదయం 5 గంటలకే నీటిని వదులుతుండడంతో ఇబ్బందిగా మారింది. కొత్తపేట డివిజన్ పరిధిలోని న్యూ మారుతీనగర్, సత్యానగర్, ఎస్బీహెచ్ కాలనీ, న్యూ నాగోల్, మోహన్నగర్ పరిధి, జనప్రియ అవెన్యూ, జనప్రియ క్వార్టర్స్, గృహాలతో పాటు అపార్టుమెంట్లలో వాటర్బోర్డు సరఫరా చేసే నీరు సరిపోవడం లేదు. ఆర్టీసీ కాలనీ, భరత్నగర్, శివమ్మనగర్ల్లో కొద్దిసేపే నీటిని విడుదల చేస్తున్నారు. అదీ లో ప్రెషర్తో వస్తుండంతో నీరు సరిపోవడం లేదు.
సరఫరా సమయాల మార్పు..! పలు ప్రాంతాల్లో అరగంట నుంచి 45 నిమిషాలే..!!
ముషీరాబాద్ నియోజకవర్గంలోని ఆరు డివిజన్లలో తాగునీటి సమస్య ఉంది. భోలక్ఫూర్లోని మహాత్మానగర్, ఇందిరానగర్లో లోప్రెషర్తో ఇబ్బందులు పడుతున్నారు. రాంనగర్ కూరగాయల మార్కెట్ వీధిలో కొన్ని రోజులుగా నీటి సరఫరా లేక స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. టీఆర్టీ క్వార్టర్స్లో నీటి సరఫరా నిలిచిపోవడంతో మినరల్ వాటర్ కొనుగోలు చేశారు. భోలక్ఫూర్లోని వెంకటేశ్వరకాలనీ, ఇందిరానగర్, పద్మశాలీనగర్లో లోప్రెషర్, తాజీర్నగర్లో కలుషిత నీటి సరఫరా అవుతోంది. అంబర్పేట నియోజకవర్గంలోని బతుకమ్మకుంట, పోచమ్మబస్తీ, బూర్జుగల్లీ, రహత్నగర్, తిలక్నగర్, శివానందనగర్, సత్యానగర్, రత్నానగర్ తదితర ప్రాంతాలలోనూ అదే పరిస్థితి. అంబర్పేటలోని పటేల్నగర్, ప్రేమ్నగర్, నింబోలిఅడ్డా, మోతిమార్కెట్, బండలబస్తీ, కుత్బీగూడ, నెహ్రూనగర్, అడ్డిఖార్ఖానా, మల్లికార్జున్నగర్, రామకృష్ణనగర్ తదితర ప్రాంతాలలో లోప్రెషర్ సమస్య నెలకొంది.
సమయపాలన లేదు..! ఉదయం 5 గంటలకే నీటి సరఫరా..!!
కుత్బుల్లాపూర్ డివిజన్ పరిధిలోని కొన్ని ప్రాంతాల్లో ఇష్టానుసారం తాగునీటిని సరఫరా చేస్తున్నారు. పద్మానగర్ ఫేజ్- 1,2, వాజ్పాయినగర్, దత్తాత్రేయనగర్, అంబేడ్కర్నగర్లతోపాటు పలు ప్రాంతాల్లో లోప్రెషర్ సమస్య ఉంది. వాజ్పాయినగర్, మాణిక్యానగర్తో మురికినీరు సరఫరా అవుతోంది. జగద్గిరిగుట్ట పరిధిలోని మగ్దూంనగర్, భగత్సింగ్ మార్గ్, గవర్నమెంట్ స్కూలు పరిధిలో మంచినీరు లోప్రెషర్తో, సమయపాలన లేకుండా వస్తోంది. నీరు ఎప్పుడు వస్తుందో తెలియక పను లు మానుకోని ఎదురు చూడాల్సి వస్తోంది. ఎత్తై న ప్రాంతాల వారికి అసలు నీరే రావడం లేదు. కూకట్పల్లి పరిధిలోని భాగ్యనగర్ సెక్షన్, కేపీహెచ్బీ సెక్షన్ల పరిధిలో లోప్రెషర్ వల్ల కనీస అవసరాలకు కూడా నీళ్లు సరిపోవడం లేదని జనం గగ్గోలు పెడుతున్నారు.
అంతంతమాత్రంగానే..! చోద్యం చూస్తున్న వాటర్ బోర్డ్ అదికారులు..!!
సికింద్రాబాద్లోని సీతాఫల్మండి, శ్రీనివాసనగర్ వాటర్బోర్డు సెక్షన్ కార్యాలయం పరిధిలో నీటి సరఫరా అంతంత మాత్రమే ఉంది. సీతాఫల్మండి జలమండలి సెక్షన్ పరిధిలోని బీదలబస్తీ, టీఆర్టీ కాలనీ, మేడిబావి, బ్రాహ్మణబస్తీ, శ్రీనివా్సనగర్, మహ్మద్గూడ, శ్రీనివా్సనగర్ వాటర్బోర్డు సెక్షన్ పరిధిలోని షాబాద్గూడ, వారాసిగూడ, బౌద్ధనగర్, అంబానగర్, పార్శిగుట్ట, న్యూఅశోక్నగర్, లలితానగర్ తదితర ప్రాంతాల్లో అంతంతమాత్రమే నీటి సరఫరా అవుతోంది. న్యూఅశోక్నగర్, పార్శిగుట్ట, సంజీవపురం, మహ్మద్గూడ, షాబాద్గూడ, మేడిబావి తదితర ప్రాంతాల్లో ముందుగా పదిహేను నిమిషాలు మురికినీరు వస్తుందని స్థానికులు చెబుతున్నారు. బన్సీలాల్పేట్ డివిజన్ పరిధిలోని సీసీ నగర్, భోలక్పూర్ మేకలమండి ప్రాంతంలో నీటి సరఫరా సరిగాలేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. మధ్యాహ్నం నీటి సరఫరా వల్ల ఇబ్బందులు పడుతున్నా రు. మొదటి పదినిమిషాలు కలుషితనీరు వస్తోందని వాపోతున్నారు.