రేవంత్ రెడ్డికి పీసీసీనా ఎవడు చెప్పిండు..! ఒరిజినల్ కాంగ్రెస్ నాయకులు ఎమి కావాలె..?
హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా పార్టీని బలోపేతం చేయాలని కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయించింది. ఇందులో ఎఐసీసీ అద్యక్షుడి నియామకం తర్వాత పలు రాష్ట్రాల పీసీసీలను నియమించాలని కూడా ఆ పార్టీ కృతనిశ్చయంతో ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం తెలంగాణలో ఎలాంటి రాజకీయ హడావిడి లేనందున పీసీసీ మార్పు కోసం కసరత్తు ప్రారంభమైనట్లు తెలుస్తోంది. అందుకోసం అందరిని కలుపుకుపోయి, ప్రజాకర్షణ కలిగిన నేత కోసం కాంగ్రెస్ అదిష్టానం దృష్టి పెట్టినట్టు సమాచారం.
కాంగ్రెస్ పార్టీకి ప్రియాంక గాంధీ తోనే పూర్వవైభవం..
మారుతున్న కాలం ప్రకారం యూత్ ని ఎక్కువ ఆకర్షించే నేత ఐతే తెలంగాణలో ప్రభావం చూపించగలరనే నమ్మకాన్ని కాంగ్రెస్ అదిష్టానం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డికి పీసిసి బాద్యతలంటూ చర్చ జరుగుతోంది. కాని ఇదే అంశాన్ని ఆ పార్టీ సీనియర్ నేత వీ. హనుమంతరావు ఖండిస్తున్నారు.
ఏఐసీసీ అద్యక్షపదవి నియామకం పూర్తయిన తర్వాత పీసిసి నియామకానికి కాంగ్రెస్ అదిష్టానం శ్రీకారం చుట్టబోతున్నట్టు చర్చ జరగుతోంది. యువనేత మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డికే తెలంగాణ పీసిసి పగ్గాలు అంటూ ప్రచారం జరుగుతోంది. యువతలో మంచి ఆదరణ, ముఖ్యమంత్రికి గట్టి కౌంటర్ ఇవ్వగలిగే సత్తా రేవంత్ రెడ్డికి ఉన్నట్టు కూడా పలు సందర్బాల్లో రుజువైంది.
ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి పేరు తెరమీదకు వచ్చినట్టు తెలుస్తోంది. ఐతే పీసిసి పదవి రేవంత్ రెడ్డికి ఇస్తే క్షమించేది లేదని పార్టీ సీనియర్ నేత వీ.హనుమంతరావు హెచ్చరిస్తున్నారు. పార్టీని నమ్ముకుని ఎప్పటినుంచో పని చేస్తున్నామని, అలాంటి వారిని కాదని కొత్తగా వచ్చిన వారికి పదవులు ఎలా ఇస్తారని ఆయన మండిపడ్డారు. మంగళవారం వన్ ఇండియాతో మాట్లాడిన వీహెచ్ పలు ఆసక్తికర అంశాలను పంచుకున్నారు.