కారు నిండింది: ఒక్కో డివిజన్కు 8 మంది పోటీ.. మీకు అభ్యర్థులే లేరుగా.. తలసాని ఫైర్
గ్రేటర్ ఎన్నికల్లో ప్రధాన పార్టీల మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరింది. ఇటు అభ్యర్థులను ప్రకటిస్తూనే.. అటు కయ్యానికి కాలుదువ్వుతున్నారు. తొలుత బీజేపీ.. తర్వాత కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించింది. అయితే సాయంత్రం టీఆర్ఎస్ ఏకంగా 105 స్థానాలకు క్యాండెట్ల పేర్లను వెల్లడించింది. ఇదిలా ఉంటే విపక్షాలపై మంత్రి తలసాని గుస్సా మీదున్నారు. విపక్షాలకు అభ్యర్థులు దొరకడం లేదన్నారు. కానీ తమకు ఒక్కో డివిజన్కు 8 మంది అభ్యర్థులు ఉన్నారని పేర్కొన్నారు.
ఎందుకు టికెట్లు ఇస్తున్నారు.. మరీ
బలంగా ఉంటే వేరే పార్టీ నాయకులకు ఎందుకు టికెట్లు ఇస్తున్నారని కాంగ్రెస్, బీజేపీలను తలసాని ప్రశ్నించారు. ఆ రెండు పార్టీలకు 75 స్థానాల కంటే మించి అభ్యర్థులు దొరకరని కామెంట్ చేశారు. వీరిలో కూడా 15 మంది మాత్రమే బలవంతులు అని.. మిగతా వాళ్లు నామ్ కే వాస్త్ అంటూ చెప్పారు. టీఆర్ఎస్ పార్టీ టికెట్ల ఎంపిక పూర్తయిందని.. అందుకే నేతలు ఇతర పార్టీల్లోకి వెళుతున్నారని చెప్పారు. తమ పార్టీ 104 సీట్లలో విజయం సాధిస్తోందని మరోసారి ధీమాను వ్యక్తం చేశారు. టీఆర్ఎస్కు కాంగ్రెస్తో పోటీ అని.. బీజేపీ కాదన్నారు.
108 ఏళ్ల తర్వాత..
24 గంటల కరెంట్, కేసీఆర్ కిట్, బస్తి దవాఖాన, వైకుంఠ ధామం, ఫుట్ ఫాత్ అభివృద్ధి చేశామని తలసాని గుర్తు చేశారు. 108 ఏళ్ల తరువాత భారీ వరద రాష్ట్రానికి వచ్చిందని ఇటీవల కురిసిన వర్షాల గురించి చెప్పారు. వరద సమయంలో పక్క రాష్ట్రాలు నయమని.. వారి కంటే కేంద్రం పరిస్థితి దారుణంగా ఉందన్నారు. నెల రోజుల తర్వాత కేంద్ర బృందాలు వచ్చాయని.. రుపాయి ఇవ్వలేదని మంత్రి తలసాని ఆరోపించారు. వరదలు వచ్చిన సమయంలో బాధితులకు అండగా నిలపడ్డామని చెప్పారు.
రూ.10 వేల సాయం
వరద బాధితులకు రూ. 10 వేల ఇచ్చామని చెప్పారు. తొలుత 4 లక్షల 75 వేల మందికి నేరుగా డబ్బులు ఇచ్చామని తెలిపారు. మీసేవలో దరఖాస్తు చేసిన లక్ష 65 మందికి కూడా డబ్బులు ఇచ్చామని వివరించారు. దీనిపై కొందరు ఈసీకి ఫిర్యాదు చేశారని ఆరోపించారు. 70వేల కోట్లతో హైదరాబాద్ అభివృద్ధి చేశామన్నారు. మరోవైపు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల మొదటి జాబితాను కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. 29 మంది అభ్యర్థుల పేర్లతో ఫస్ట్ లిస్టును పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు