ముఖాలకు ముసుగులు.. మొన్న మాస్క్లు, నేడు హెల్మెట్లు.. రూట్ మార్చుతున్న దొంగలు
హైదరాబాద్ : దొంగలు కొత్త దారులు వెతుక్కుంటున్నారు. పోలీసులు నయా టెక్నాలజీ మీద ఆధారపడుతున్నట్లుగానే వాళ్లు కూడా రూట్ మార్చేశారు. కొత్త తరహాలో చోరీలు చేస్తూ పోలీసులకు సవాల్ విసురుతున్నారు. ఖాకీలకు చిక్కకుండా పకడ్బందీగా దోపిడీలకు పాల్పడుతున్నారు. ఆనవాళ్లు దొరక్కుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇటీవల తమిళనాడులోని ప్రముఖ జ్యువెల్లరీ షాపులో జరిగిన దోపిడీలో ముసుగు ధరించారు దొంగలు. అదే క్రమంలో తాజాగా బీహార్లో బ్యాంకు రాబరీకి పాల్పడ్డ దొంగలు హెల్మెట్లు ధరించడం విస్మయం కలిగిస్తోంది.
ఆ జ్యువెల్లరీ షాపు చోరీలో ట్విస్ట్.. నగలు దోచాడు.. నటితో పరారయ్యాడు..!
ముఖానికి ముసుగులతో 13 కోట్ల నగలు మాయం..!
తమిళనాడులోని తిరుచ్చిలో ప్రముఖ జ్యువెల్లరీ షాపులో ఇటీవల జరిగిన దొంగతనం దేశవ్యాప్తంగా చర్చానీయాంశమైంది. దొంగల ముఠా నేత తిరువారూరు మురుగన్ నేతృత్వంలో జరిగిన 13 కోట్ల రూపాయల నగల చోరీ హాట్ టాపికైంది. అయితే ఈ దోపిడీలో దొంగలు ప్రవర్తించిన తీరు పోలీసులకు సవాల్ విసిరింది. ముఖానికి ముసుగులు ధరించి నగల దుకాణం దోపిడీకి పాల్పడిన వైనం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దానికి సంబంధించిన వీడియో కూడా బాగా సర్క్యులేట్ అయింది.
సీసీ కెమెరాల కంటికి చిక్కకుండా.. పోలీసులకు దొరక్కుండా దొంగలు వేసిన ముసుగు స్కెచ్ వర్కవుట్ అయింది. ముఖాలకు ముసుగులు ధరించి దర్జాగా దోచుకెళ్లారు. అయితే ఈ కేసులో నిందితుడిగా ఉన్న తిరువారూరు మాడపురానికి చెందిన మణికంఠన్ నాలుగు కిలోల బంగారు ఆభరణాలతో అనుకోకుండా పోలీసులకు చిక్కడంతో ముఠా గుట్టు రట్టైంది. లేదంటే ఈ కేసు చేధించడానికి పోలీసులకు పెద్ద సవాల్గా మారేదనే వాదనలు లేకపోలేదు.
బీహార్లోనూ అలాంటి చోరీ.. హెల్మెట్లు ధరించి బ్యాంకు లూటీ
శనివారం (05.10.2019) నాడు బీహార్లో జరిగిన బ్యాంకు దోపిడీ కూడా సేమ్ అలాంటి సీన్ తలపించింది. ముజఫర్పూర్ లోని గోబర్సాహి ఏరియాలో ఓ ప్రైవేట్ బ్యాంకులోకి చొరబడ్డ దొంగలు బీభత్సం సృష్టించారు. అయితే చోరీ సమయంలో వాళ్లు ముఖాలు కనిపించకుండా హెల్మెట్లు ధరించడం గమనార్హం. ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఆరుగురు వ్యక్తులు హెల్మెట్లు ధరించి బ్యాంకు లోపలికి చేరుకున్నారు. ఎంట్రీ ఇస్తూనే తుపాకులతో బెదిరించి బ్యాంకు క్యాషియర్ కౌంటర్ నుంచి 8 లక్షలకు పైగా నగదు దోచుకెళ్లారు. అంతేకాదు సెక్యూరిటీ గార్డు తమకు అడ్డుపడకుండా అతడి నుంచి తుపాకీ ఎత్తుకెళ్లారు.
టెక్నాలజీ వాడుతున్న పోలీసులు.. సవాల్ విసురుతున్న దొంగలు
అందివచ్చిన టెక్నాలజీతో నేరగాళ్ల గుట్టు రట్టు చేస్తున్న పోలీసుల బారి నుంచి తప్పించుకోవడానికి దోపిడీ దొంగలు పంథా మార్చుతున్నారు. పోలీసులకు చిక్కకుండా చోరీలు చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అదే క్రమంలో ముఖాలకు ముసుగులు ధరించడం.. లేదంటే హెల్మెట్లు పెట్టుకుని యధేచ్ఛగా దోపిడీలకు పాల్పడుతున్నారు. ఇదంతా కూడా కేవలం పోలీసులకు దొరక్కుండా తప్పించుకోవడానికి అనుసరిస్తున్న విధానం. అంతేకాదు ఇలాంటి వేషధారణతో సీసీ కెమెరాలకు సైతం చిక్కే వీలు లేకుండా పోతోంది. దాంతో ఇలాంటి దొంగలు రెచ్చిపోతున్న కేసులను చేధించడం పోలీసులకు పెద్ద సవాల్గా మారుతోంది.