Rains: తెలంగాణలో మరో వారంపాటు భారీ వర్షాలు, పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
హైదరాబాద్: రాజధాని నగరంతోపాటు మరికొన్ని రోజులపాటు తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కొనసాగనున్నాయి. గత మూడు రోజులుగా హైదరాబాద్ తోపాటు తెలంగాణ జిల్లాల్లో కుండపోత వర్షాలు కురిశాయి. తాజాగా, వచ్చే వారం రోజుల పాటు తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఈ మేరకు వాతావరణ శాఖ పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. శుక్రవారం నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి, మెదక్, వికారాబాద్ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయంటూ వాతావరణ శాఖ హెచ్చరించింది.
మరోవైపు, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, కొమురంభీమ్ ఆసిఫాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్ధిపేట, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి, కామారెడ్డి, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, హైదరాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. గురువారం మహబూబ్నగర్లో మూడు గంటలపాటు ముంచెత్తిన వానతో పట్టణం మొత్తం జలమయంగా మారింది. కుండపోత వర్షంతో మహబూబ్నగర్ పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రోడ్లు జలమయమయ్యాయి, లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లల్లోకి వరదనీరు చేరింది. మరోవైపు, సూర్యాపేట జిల్లాల్లో కూడా భారీ వర్షం కురిసింది.
ఇక గత మూడు రోజులుగా వరుసగా హైదరాబాద్ నగరంలో కుండపోత వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. రోజూ సాయంత్రం భారీ వర్షాలు కురుస్తుండటంతో రోడ్లన్నీ జలమయమవువుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. దీంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు.