టీఆర్ఎస్లో ఏం జరుగుతోంది.. మొన్న ఈటల, నేడు నాయిని.. అసంతృప్తుల సెగ వెంటాడుతోందా?
Recommended Video
హైదరాబాద్ : టీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతోంది. మొన్న ఈటల వాయిస్ రేజ్ చేసిన ఘటన మరిచిపోకముందే.. తాజాగా మాజీ హోం మంత్రి నాయిని నర్సింహా రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఆ క్రమంలో గులాబీ ఓనర్లు ఎవరు.. కిరాయిదారులు ఎవరనే అంశం హాట్ టాపికైంది. ఇంతకు టీఆర్ఎస్ పార్టీని అసంతృప్తుల సెగ వెంటాడుతోందా.. లేదంటే ఇతరత్రా పరిణామాలు ఏమైనా జరుగుతున్నాయా అనేది చర్చానీయాంశమైంది. సీఎం కేసీఆర్ వ్యూహాలు అంత తేలిగ్గా ఉండబోవనేది పార్టీ శ్రేణులు బహిరంగంగా చెప్పుకునే మాట. అలాంటిది ఆయన్ని ఎదిరించే నేతలు తట్టుకుని నిలబడగలరా అనేది మరో కోణం.
ఖైరతాబాద్ పెద్ద గణేశుడిదే తొలి నిమజ్జనం.. మద్యం దుకాణాలు బంద్ ఎప్పుడంటే..!
గులాబీ రథ సారధికి తాజా పరిణామాలు షాకేనా?
ఉద్యమ పార్టీగా అవతరించి బలమైన రాజకీయ శక్తిగా మారిన టీఆర్ఎస్ పార్టీ క్షేత్ర స్థాయిలో వీపరీతమైన ప్రజాదరణ పొందింది. పింఛన్లు తదితర సంక్షేమ పథకాల అమలుతో ప్రజలకు దగ్గరైంది. తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్ గళమెత్తి నినదించి ప్రజలందర్నీ ఏకతాటిపై నడిపించారు. అదే క్రమంలో రాష్ట్ర ఏర్పాటు తర్వాత ప్రజలకు మరింత దగ్గరయి పాలనను పరుగులు పెట్టిస్తున్నారు. దాంతో ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి టీఆర్ఎస్కే జై కొట్టిన ప్రజలు కారుకు గంపగుత్తగా ఓట్లేశారు. అలా ఇన్నాళ్లు అందర్నీ ఒకేతాటిపై నడిపించి గులాబీ రథసారధిగా వ్యవహరిస్తున్న కేసీఆర్కు తాజా పరిణామాలు షాక్ ఇస్తున్నాయని చెప్పొచ్చు.
టీఆర్ఎస్ పెద్దగా అన్నీ తానై.. ఈటల మాటల తూటాల మర్మమేంటి..!
సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ పెద్దగా అన్నీ తానై వ్యవహరిస్తారనేది అందరికీ తెలిసిందే. ఆ క్రమంలో ఇన్నాళ్లు పార్టీ నేతలంతా ఆయన చెప్పినట్లుగానే నడుచుకున్నారు. మంత్రులకు కూడా సొంత నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఇవ్వలేదనే వాదనలు కూడా చాలానే వినిపించాయి. ఆయన చెప్పిందే వేదంగా పార్టీ నేతలు నడుచుకోవాల్సిందే తప్ప ఎవరికీ కూడా సొంత నిర్ణయాలంటూ ఉండబోవనే గుసగుసలు తరచుగా వినిపిస్తూనే ఉంటాయి.
ఈటల మాటల తూటాలు బాగానే పేలాయిగా..!
ఆ క్రమంలో ఇటీవల హుజురాబాద్ పార్టీ నేతల మీటింగులో మంత్రి ఈటల రాజేందర్ సంధించిన మాటల తూటాలు బాగానే పేలాయి. గులాబీ ఓనర్లమంటూ ఆయన మాట్లాడిన తీరు టీఆర్ఎస్ పార్టీలోని లుకలుకలు బయటపెట్టిందనే వాదనలు లేకపోలేదు. సీఎం కేసీఆర్ ఈటలను పక్కకు పెడుతున్నారని.. ఆయన్ని ఏమాత్రం పట్టించుకోవడం లేదనే ప్రచారం అందరికీ తెలిసిందే. అదలావుంటే ఇటీవల కలెక్టర్ల సమావేశంలో కొత్త రెవెన్యూ చట్టం గురించి ఈటల బయటకు లీకులు ఇచ్చారనే ముద్ర పడింది. వీటన్నింటి నేపథ్యంలో ఈటల మనస్థాపానికి గురై హుజురాబాద్లో అలా మాట్లాడారనే వాదనలు లేకపోలేదు.
ఈటలకు మద్దతుగా రసమయి.. ఇప్పుడు అదే బాటలో నాయిని..!
అదలావుంటే ఈటల మాటలకు మద్దతిచ్చినట్లుగా ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కూడా అదే ధోరణిలో మాట్లాడటం మరింత చర్చానీయాంశమైంది. తాజాగా మాజీ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి కూడా తనలోని ఆవేదన వెళ్లగక్కారు. సీఎం కేసీఆర్పై అన్నట్లుగానే తనలోని అసంతృప్తిని బహిరంగంగా వినిపించారు. తనకు మంత్రి పదవి ఇస్తానని కేసీఆర్ మాట తప్పారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో తాను ఎమ్మెల్యేగా పోటీ చేస్తానంటే వద్దని చెప్పి.. ఎమ్మెల్సీని చేసి మంత్రి పదవి కట్టబెడతానంటూ మాటిచ్చి తప్పారని ఆరోపించడం హాట్ టాపికైంది.
టీఆర్ఎస్లో అసంతృప్తులా.. నో నెవర్.. కేసీఆర్ దగ్గర అస్త్రశస్త్రాలు..!
ఎక్కడ నెగ్గాలో, ఎక్కడ తగ్గాలో కేసీఆర్కు బాగా తెలుసనే వాదనలు కొకొల్లలు. ఈటల రాజేందర్ హుజురాబాద్ పార్టీ మీటింగులో ఉద్విగ్నంగా మాట్లాడిన కొద్ది గంటల్లోనే మళ్లీ ఆయన మాట మార్చారు. అయితే దాని వెనుక కేటీఆర్ ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. ఈటల అలా మాట్లాడటంతో వెంటనే కేటీఆర్ను రంగంలోకి దించి ఆయనలోని ఆగ్రహా జ్వాలల్ని చల్లార్చినట్లు తెలుస్తోంది. అలా పార్టీలో ఏ కొద్దిగా ఇలాంటి సిట్యువేషన్ కనిపించినా కేసీఆర్ వెంటనే అప్రమత్తం అవుతారనడానికి ఇదే పెద్ద నిదర్శనంగా చెప్పొచ్చు. అంతేకాదు ఈటలకు చాలాకాలంగా కేసీఆర్ దర్శనభాగ్యం లేదు. తాజాగా మంత్రివర్గ విస్తరణకు ముందు ప్రగతి భవన్లో కేసీఆర్ను కలిసే భాగ్యం ఈటలకు కలిగింది.
నాయినికి నామినేటేడ్ పోస్ట్ ఇస్తారా?
అలాంటిది ఇప్పుడు నాయినిని కూడా కేసీఆర్ మళ్లీ ఏదో రకంగా బోల్తా కొట్టించకపోరుగా అనే టాక్ వినిపిస్తోంది. నామినేటేడ్ పోస్టు కట్టబెట్టి ఆ పెద్దాయనను ఊరడిస్తారనే వాదనలు లేకపోలేదు. మొత్తానికి టీఆర్ఎస్లో అసంతృప్త సెగలు ఉవ్వెత్తున ఎంత పైకి లేస్తాయో.. అంతే వేగంగా వాటిని చల్లార్చడానికి కేసీఆర్ దగ్గర అస్త్రశస్త్రాలు ఉన్నాయనేది అందరికీ తెలిసిందే కదా.